Begin typing your search above and press return to search.

50 కోట్లు.. 100 కోట్లు.. వద్దంటున్న నాగ్

By:  Tupaki Desk   |   24 May 2017 8:55 AM GMT
50 కోట్లు.. 100 కోట్లు.. వద్దంటున్న నాగ్
X
పోయినేడాది ‘సోగ్గాడే చిన్నినాయనా’తో అక్కినేని నాగార్జున తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. తొలిసారి రూ.50 కోట్ల షేర్ మార్కును అందుకున్నాడు. అదే విషయం ఇప్పుడు ప్రస్తావిస్తే.. అదేమంత గొప్ప విషయం కాదంటున్నాడు నాగ్. 50 కోట్లే కాదు.. 100 కోట్ల క్లబ్ గురించి కూడా ఇప్పుడు మాట్లాడకూడదని అంటున్నాడు నాగ్. ‘బాహుబలి’ దెబ్బకు తెలుగు సినిమా మార్కెట్ అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో ఇలాంటి చిన్న విషయాల గురించి చర్చ వద్దంటున్నాడు నాగ్. ‘బాహుబలి’ నుంచి పాఠాలు నేర్చుకుని తెలుగు సినిమా మరింత గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించాడు అక్కినేని హీరో.

‘‘ఇంకా రూ.50 కోట్లు.. వంద కోట్ల క్లబ్‌ ఏంటి? మనం ఇప్పుడు రూ.1500 కోట్ల క్లబ్బులో ఉన్నాం. ఇకపై 50 కోట్ల గురించీ 100 కోట్ల గురించీ మాట్లాడుకోకపోవడం మంచిది అనిపిస్తోంది. సినిమాను దేవుడిలా భావించి ప్రేమించండి.. పూజించండి.. అన్న సందేశాన్నిచ్చింది బాహుబలి. ఈ సినిమాతో నాకేం వస్తుంది.. ఎంత లాభం అందుకుంటాను.. అనే లెక్కలేం వేసుకోకుండా కష్టపడితే.. ఫలితం దానికదే వస్తుందని బాహుబలి నిరూపించింది. మన సినిమా రూ.1500 కోట్లు వసూలు చేస్తుందని మనం వూహించామా? బాలీవుడ్‌ వాళ్లకు నాలుగైదేళ్ల కిందటే మార్కెట్లు ఓపెన్‌ అయ్యాయి. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయి సినిమా ఎప్పుడు చూస్తామో? ‘మాయాబజార్‌’ రిలీజైన టైంలో మనకున్న థియేటర్లు ఎన్ని? థియేటర్లు ఎన్ని ఉన్నప్పటికీ అక్కడికొచ్చి సినిమా చూసేవాళ్లు ఎంత మంది? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 2 వేల థియేటర్లు ఉన్నాయి. దాంతో వసూళ్లు పెరుగుతున్నాయి’’ అని నాగ్ అన్నాడు.

మరోవైపు జీఎస్టీ పన్ను విధానం వల్ల తెలుగు సినిమాలకు ఇబ్బందులు తప్పవని అన్నాడు నాగ్. ఇప్పటిదాకా పన్ను 18 శాతమే ఉండగా.. జీఎస్టీ ద్వారా 28 శాతం పన్ను విధించబోతున్నారని.. 10 శాతం పన్ను పెరగడం వల్ల ఇటు ఇండస్ట్రీకి.. అటు ప్రేక్షకులకు నష్టమే అని నాగ్ అభిప్రాయపడ్డాడు. హిందీ సినిమాలకు ఇప్పటిదాకా ఉన్న పన్నుతో పోలిస్తే.. జీఎస్టీ ద్వారా పడే పన్ను తక్కువే కాబట్టి.. వాళ్లకు లాభం చేకూరుతుందని నాగ్ అన్నాడు.