Begin typing your search above and press return to search.

RRR ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో చెప్పేసిన ప్రొడ్యూసర్..!

By:  Tupaki Desk   |   9 Dec 2021 4:30 PM GMT
RRR ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో చెప్పేసిన ప్రొడ్యూసర్..!
X
ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా అయినా మూడు, నాలుగు వారాల్లోనే ఓటీటీ వేదికల్లోకి వచ్చేస్తోంది. భారీ ధరకు రైట్స్ తీసుకున్న సంస్థలు మూవీ థియేట్రికల్ రన్ ముగిసే లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ పెడుతున్నాయి. ఇందులో స్టార్ హీరోల సినిమాలు - పెద్ద చిత్రాకు కూడా ఉండటం గమనార్హం. అయితే రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ''ఆర్.ఆర్.ఆర్'' సినిమా మాత్రం రెండున్నర నెలల నుంచి మూడు నెలల తరువాతే డిజిటల్ వేదిక మీదకు వస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని హిందీలో సమర్పిస్తున్న పెన్ స్టూడియోస్ అధినేత, నిర్మాత జయంతిలాల్ గడా ఈ విషయాన్ని వెల్లడించారు. “RRR సినిమా థియేట్రికల్ రిలీజ్ చేసిన 75 నుండి 90 రోజుల తర్వాత ఓటీటీలో ప్రీమియర్ అవుతుంది. ప్రజలు చాలా కాలం పాటు సినిమా హాళ్లలో దీనిని ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నారని మేము విశ్వసిస్తున్నాము. అందుకే మేము 30 రోజుల ప్రీమియర్ ని ఎంచుకోలేము'' అని జయంతి లాల్ అన్నారు.

'RRR' సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా అన్ని భాషల ఎలక్ట్రానిక్ - డిజిటల్ - శాటిలైట్ హక్కులను పెన్ స్టూడియోస్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇది భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా అభివర్ణించారు. ఇక పెన్ స్టూడియోస్ వారు కూడా ప్రపంచ వ్యాప్తంగా పది భాషలకు సంబంధించిన రైట్స్ ను ఇప్పటికే అమ్మేశారు.

హిందీతో పాటుగా విదేశీ భాషలకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకి చెందిన డిజిటల్ హక్కులను జీ5 దక్కించుకుంది. 'RRR' హిందీ శాటిలైట్ హక్కులు 'జీ సినిమా' సొంతం చేసుకోగా.. దక్షిణాది భాషల రైట్స్ 'స్టార్' గ్రూప్ చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు RRR చిత్రాన్ని ఓటీటీలో మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్ చేస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను నమోదు చేయడానికి సహాయపడుతుంది.

కాగా, రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా 'ఆర్.ఆర్.ఆర్'. ఆలియా భట్ - అజయ్ దేవగన్ - శ్రియా - సముద్ర ఖని వంటి పాపులర్ నటీనటులు ఇందులో భాగం అయ్యారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 2022 జనవరి 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో లేటెస్టుగా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.