Begin typing your search above and press return to search.

అప్పుడు బాధపడ్డాను .. ఇప్పుడు గర్వపడుతున్నాను

By:  Tupaki Desk   |   25 April 2022 4:35 AM GMT
అప్పుడు బాధపడ్డాను .. ఇప్పుడు గర్వపడుతున్నాను
X
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలదే హవా. భారీతనం నుంచి అవార్డుల వరకూ ఏ వేదికపై అయినా బాలీవుడ్ సినిమాలే హల్ చల్ చేసేవి. బాలీవుడ్ సినిమాలు నిర్మాణం పరంగా చాలా సమయాన్ని తీసుకుంటాయి. అయితే బలమైన కథాకథనాలను తెరకెక్కించడానికి అవసరమైన వనరులు వాళ్లకి అందుబాటులో ఉండేవి. ఆ హీరోలకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండటం వలన, పెట్టిన పెట్టుబడికి అనేక రెట్లు వసూలు చేసేవి. దక్షిణాది సినిమాలలో నేటివిటీకి తగిన కంటెంట్ ఉండటంతో, అవి ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేవి.

అందువలన సినిమాకి సంబంధించినంతవరకూ ప్రపంచపటానికి దక్షిణాది సినిమా దూరంగానే ఉంటూ వచ్చింది. బాలీవుడ్ సినిమాలు భారీస్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంటూ వెళుతుంటే చప్పట్లు కొడుతూ వాళ్లను ప్రోత్సహిస్తూ ఆడియన్స్ లో కూర్చోవలసి వచ్చింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. తెలుగు సినిమా ఆడియన్స్ లో నుంచి లేచి ఇప్పుడు వేదికలపైకి వచ్చేసింది.

భారీతనంలోను .. వసూళ్లలోను బాలీవుడ్ వారు సైతం ఆశ్చర్యపోయేలా సంచలనం సృష్టిస్తోంది. కొంతకాలంగా బాలీవుడ్ హీరోల గురించి కాకుండా తెలుగు సినిమాను గురించి .. తెలుగు హీరోల గురించి జనం మాట్లాడుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ మార్పును గురించి తాజాగా చిరంజీవి ప్రస్తావించారు. " 80 దశకం చివరిలో 'రుద్రవీణ' సినిమాకి 'నర్గిస్ దత్' అవార్డు వచ్చినప్పుడు .. ఆ అవార్డును తీసుకోవడానికి నేను ఢిల్లీ వెళ్లాను. అక్కడ స్టేజ్ పై బాలీవుడ్ సినిమాకి మాత్రమే ప్రాధాన్యత లభించడం చూశాను. తెలుగు సినిమాకి అసలు ఎలాంటి ప్రాముఖ్యత లేకపోవడం నాకు చాలా బాధను కలిగించింది .. అవమానంగా అనిపించింది. తెలుగు సినిమా విశ్వవ్యాప్తమయ్యే రోజు ఎప్పుడు వస్తుందా అనుకున్నాను. నేను కలలు కన్న ఆ రోజు ఇప్పుడు వచ్చింది. 'ఆర్ ఆర్ ఆర్' .. 'పుష్ప' సినిమాలే అందుకు ఉదాహరణ.

ఈ సినిమాలకి దక్కిన ఆదరణ .. అవి సాధించిన వసూళ్లు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రాజమౌళి 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా తన దిశను మార్చుకుంది. తన ప్రత్యేకతను .. తన వైభవాన్ని చాటుకుంటోంది. తమిళం నుంచి శంకర్ ఎప్పుడో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ రంగంలోకి దిగారు. సౌత్ సినిమా పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తున్నారు. ఇదంతా నా కళ్ల ముందు జరుగుతూ వచ్చిన మార్పు. ఈ మార్పు చూసి నేను గర్వపడుతున్నాను" అని చెప్పుకొచ్చారు.