Begin typing your search above and press return to search.

ఇంటర్వ్యూ: 'సినిమాలు లేకపోతే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటా'

By:  Tupaki Desk   |   21 Jun 2022 7:30 AM GMT
ఇంటర్వ్యూ: సినిమాలు లేకపోతే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటా
X
'దళం' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన జీవన్ రెడ్డి.. 'జార్జ్ రెడ్డి' చిత్రంతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా జీవన్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా "చోర్ బజార్". ఇందులో గెహనా సిప్పీ నాయికగా నటించింది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

* నా గత చిత్రాలైన 'దళం' 'జార్జ్ రెడ్డి' కి భిన్నంగా పూర్తి ఎంటర్టైన్మెంట్ తో రూపొందించిన చిత్రమిది. బ్లడ్ షెడ్ లేకుండా వినోదాత్మక సినిమా చేయాలని భావించే ఈ చిత్రాన్ని తెరకెక్కించా. ఇది జార్జ్ రెడ్డి సినిమా కంటే ముందు సిద్ధమైన కథ. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా ఉంటుంది. దాదాపు 35 రోజులు రాత్రి పూట షూటింగ్ చేశాం. అయినా సన్నివేశాలన్నీ బ్రైట్ గా, కలర్ ఫుల్ గా వచ్చాయంటే దానికి మా సినిమాటోగ్రాఫర్ జగదీశ్ టాలెంట్ కారణం.

* 'చోర్ బజార్' కు నేను వెళ్తుండేవాడిని. అక్కడి మనుషుల స్వభావం ఆకట్టుకుంది. వాళ్లు వస్తువులు దొంగతనం చేయరు. మనం వద్దనుకుని పడేసిన వస్తువులను సేకరించి అక్కడ తక్కువ ధరలకు అమ్ముతుంటారు. మా సినిమా షూటింగ్ కోసం అక్కడి నుంచి చాలా వస్తువులు లోడ్ లలో తెప్పించాం. ఏమాత్రం గుర్తింపు లేని మనుషులు వారు. ఆధార్ కార్డులు కూడా ఉండవు. వాళ్లను అడిగితే మాకు ఓటు హక్కు లాంటి కనీస గుర్తింపు లేదని బాధపడుతుంటారు. ఇలాంటి అంశాల్ని సినిమాలో ప్రస్తావించాం.

* 'చోర్ బజార్' లో నేను చూసిన మనుషులు రాత్రంతా బిజినెస్ చేసి, పగలు నిద్రపోతుంటారు. పగటి పూట ఓ జీవితం.. రాత్రి మరో జీవితం గడుపుతుటారు. ప్రతి ఒక్కరూ ఒక్కో హీరోను అభిమానిస్తారు. ఆ స్ఫూర్తితోనే మా చిత్రంలో హీరోకు బచ్చన్ సాబ్ అనే పేరు పెట్టాం. రికార్డుల కోసం తాను చేసే వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ సినిమాలో పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటూ ఫుల్ కమర్షియల్ గా సాగుతుంటాయి.

* నాయికకు మూగ పాత్ర ఇవ్వడానికి కారణం. ఆమెకు మాట్లాడటం రాకున్నా ఇప్పుడున్న టెక్నాలజీ, సోషల్ మీడియా ద్వారా మాట్లాడించాం. తను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు సినిమాల డైలాగ్స్ వినిపిస్తూ చెబుతుంది. సినిమా ప్రధానంగా లవ్ స్టోరి అయినా.. ఒక విలువైన డైమండ్ చుట్టూ తిరుగుతుంది. వంద కోట్ల రూపాయల విలువైన డైమండ్ పోయినా అది చోర్ బజార్ లో ప్రత్యక్షమవుతుంది. కానీ అక్కడి వాళ్లకు దాని విలువ తెలియదు. పది రూపాయలకే అమ్ముతుంటారు. ఈ డైమండ్ చుట్టూ డ్రామా, ఫన్ క్రియేట్ అవుతాయి.

* ఆకాష్ పూరి నేను అనుకున్న పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. అతను వాయిస్, యాక్షన్, పాటల్లో డాన్సులు, పర్మార్మెన్స్ ఇలా పర్పెక్ట్ గా బచ్చన్ సాబా పాత్రను పోషించాడు. నేను చెప్పింది చెప్పినట్లు నటించాడు. నాకంటే ముందే సెట్ కు వచ్చేవాడు. అంత కమిట్మెంట్ ఉన్న హీరో. పూరి జగన్నాథ్ మంచి వ్యక్తి అనుకుంటే.., అతని కంటే ఆకాష్ ఇంకా మంచోడు అనిపించింది. ఈ కథ చెప్పేందుకు పూరి జగన్నాథ్ ను కలిస్తే.. 'రెండు సినిమాలు చేశావు కదా.. నువ్వు అనుకున్నట్లు తీయ్' అన్నారు. కథ కూడా వినలేదు. మా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు.

* నాకు సక్సెస్ ను క్యాష్ చేసుకోవడం రాదు. 'జార్జ్ రెడ్డి' తర్వాత ఆ క్రేజ్ ను ఉపయోగించుకోలేదని మిత్రులు అంటుంటారు. నా స్వభావం అంతే. మనసుకు నచ్చిన కథలను తెరకెక్కిస్తుంటా. కెరీర్ లెక్కలు వేసుకోవడం రాదు. సినిమాలు లేకపోతే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటా. ప్రతి సినిమాకు పూర్తి అంకితభావంతో పనిచేస్తుంటాను.

* నాకు గురువు ఆర్జీవీ.. అయితే ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడితో స్నేహం ఉంది. ఫోన్ చేసి మాట్లాడుతుంటాను. త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. ఆ వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడిస్తాను.