Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్స్ నెక్స్ట్ టార్గెట్ అదేనా..?

By:  Tupaki Desk   |   7 April 2022 6:30 AM GMT
మెగా ప్రిన్స్ నెక్స్ట్ టార్గెట్ అదేనా..?
X
మెగా బ్రాండ్ తో హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్ తేజ్.. కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న హీరోలలో తక్కువ టైంలో ఎక్కువ వ్యత్యాసం ఉన్న సినిమాలు చేసిన తీసిన హీరో వరుణ్ అనే చెప్పాలి.

'కంచె' 'ఫిదా' 'లోఫర్' 'తొలిప్రేమ' 'ఎఫ్ 2' 'గద్దలకొండ గణేష్' వంటి చిత్రాలలో సూపర్ హిట్స్ కూడా అందుకున్నారు వరుణ్. మధ్యలో 'అంతరిక్షం' లాంటి సినిమాలు ప్లాప్ అయినప్పటికీ.. కొత్త కథలకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు 'గని' వంటి స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వరుణ్.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రేపు ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ - సిద్దు ముద్ద ఈ సినిమాని నిర్మించారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన 'గని' చిత్రంలో ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి వరుణ్ తేజ్ చాలా హార్డ్ వర్క్ చేశారు.

దీని తర్వాత మెగా ప్రిన్స్ నటించిన 'ఎఫ్ 3' సినిమా ఇదే సమ్మర్ లో విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ తో కలిసి చేసిన ఈ సినిమా.. మే 27న థియేటర్లలోకి రానుంది. ఇది బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో రూపొందింది.

వరుణ్ ఇటీవలే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సరికొత్త మూవీని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. విలక్షణ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.

అయితే వరుణ్ తేజ్ నెక్స్ట్ టార్గెట్ పాన్ ఇండియా అని తెలుస్తోంది. గత కొంతకాలంగా టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి - రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్ వంటి వారు ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేశారు.

ఈ క్రమంలో వరుణ్ కూడా గత కొన్ని నెలలుగా ఒక పాన్ ఇండియన్ చిత్రం కోసం చర్చలు జరుపుతున్నారని టాక్. సోనీ పిక్చర్స్ ఇండియా భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తారట. దేశభక్తిని చాటిచెప్పే ఈ చిత్రంలో కథానాయకుడు ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు.

తెలుగుతో పాటుగా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని.. దీంతోనే వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారని టాల్ నడుస్తోంది. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేసి, దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.