Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డ్రగ్స్ ఎపిసోడ్ లో ఎక్సైజ్ శాఖ తీరు షాకిస్తోందా?

By:  Tupaki Desk   |   26 March 2022 4:08 AM GMT
టాలీవుడ్ డ్రగ్స్ ఎపిసోడ్ లో ఎక్సైజ్ శాఖ తీరు షాకిస్తోందా?
X
పెను సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి షాకింగ్ అంశాలు కొన్ని తాజాగా వెలుగు చూశాయి. ఇప్పటికే పలు మలుపులు తిరిగి.. సంచలన అంశాలు బయటకు వస్తాయని అందరూ భావించిన వేళ.. అందుకు భిన్నంగా ఎలాంటి వివరాలు బయటకు రాకపోవటం తెలిసిందే. దీనికి సంబంధించి మరింత విస్మయానికి గురి చేసే వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మరింత దూకుడుగా విచారణ చేసేందుకు ఈడీ ఎంతలా ప్రయత్నిస్తున్నా.. వారిని ముందుకు వెళ్లకుండా ఎక్సైజ్ శాఖ ఆపుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

దీనికి తగ్గట్లే తాజాగా ఈడీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి.. ఎక్సై్ శాఖ మీద కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయటం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలతో పాటు.. ఎక్సైజ్ శాఖ అధికారులు సేకరించిన ఆధారాల్ని ట్రయల్ కోర్టుకు అప్పగించినట్లుగా చెబుతున్న మాటల్లో నిజం లేదంటూ తన పిటీషన్ లో ఈడీ స్పష్టం చేసింది.

ఇదంతా ఎక్సైజ్ శాఖ ఎందుకు చేస్తున్నట్లు? ఎవరినైనా సేవ్ చేయాలని ఆ శాఖ భావిస్తోందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దాదాపు ఐదేళ్ల క్రితం డ్రగ్స్ డీలర్ కెల్విన్ నుంచి ఎక్సైజ్ శాఖ పలు డిజిటల్ రికార్డుల్ని స్వాదీనం చేసుకుంది. అందులో సినీ తారల వాంగ్మూలాలతో పాటు కాల్ రికార్డుల్ని సేకరించింది. ఈ వివరాలను ఈడీ అడుగుతుంటే.. ఇప్పటివరకు ఇవ్వకపోవటం అనుమానాలకు తావిస్తోంది.

సినీ తారల్నిఎక్సైజ్ అధికారులు విచారించటం తెలిసిందే. దీనికి సంబంధించిన వాంగ్మూలాల్ని కోర్టును ఇచ్చారే తప్పించి.. వారికి సంబంధించిన కాల్ రికార్డుల్ని మాత్రం ఇవ్వకపోవటాన్ని ఈడీ ప్రశ్నిస్తోంది. కెల్విన్ తో సినీ తారలకు ఉన్న సంబంధాల్నితేల్చాలంటే ఈ కాల్ రికార్డులే కీలకంగా చెబుతున్నారు. అయితే.. ఎక్సైజ్ శాఖ వద్ద ఉన్న ఆడియో.. వీడియో రికార్డులు ఏవీ ఈడీకి అందించకపోవటం గమనార్హం.

కెల్విన్ కు సంబంధించిన కూల్ ప్యాడ్.. దానికి వినియోగించిన జియో సిమ్ లతో పాటు.. ఇద్దరు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సిస్టంలు.. సీడీ డ్రైవ్ లు.. సెల్ ఫోన్లు.. పెన్ డ్రైవ్ ల వివరాలేవీ బయటకు రావటం లేదు. ఎక్సైజ్ శాఖ వద్ద ఉన్న సమాచారాన్ని.. ఆధారాల్ని తమకు అందించాలని ఈడీ ఎంత కోరినా ఎక్సైజ్ శాఖ స్పందించకపోవటాన్ని తప్పు పడుతున్నారు.

ఇప్పటివరకు ఆరు లేఖలు రాసినా స్పందించలేదని.. దీంతో హైకోర్టును ఆశ్రయించినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన విభాగాలు.. నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చోవటం ఏమిటి? ఈడీ అడుగుతున్న వివరాలు.. ఆధారాల్ని ఎక్సైజ్ శాఖ ఎందుకు ఇవ్వట్లేదు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.