Begin typing your search above and press return to search.

'టక్ జగదీష్' నిర్ణయం సరైనదేనా..?

By:  Tupaki Desk   |   25 Aug 2021 1:30 AM GMT
టక్ జగదీష్ నిర్ణయం సరైనదేనా..?
X
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో ఇండస్ట్రీలో గతేడాది పరిస్థితులు పునరావృతం అయ్యాయి. థియేటర్లు మూతబడి ఉండటంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. సినిమా విడుదల లేట్ అవుతుండటంతో ఆర్థిక భారం భరించలేని నిర్మాతలు ఓటీటీలకు మొగ్గు చూపాయి. ఈ క్రమంలో కొన్ని క్రేజీ మూవీస్ కూడా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తుండటం ఎగ్జిబిటర్స్ ను కలవరపెడుతున్న అంశం. టాలీవుడ్ లో ఓటీటీలో విడుదలకు రెడీ అయిన చిత్రాల్లో నాని 'టక్ జగదీష్' కూడా ఉంది.

'టక్ జగదీష్' సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు. నాని 'వి' తర్వాత మరొక సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయొద్దని కోరుకున్నారు. అయితే త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లోనే ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేస్తున్నామని షైన్ స్క్రీన్ అధినేత‌లు చెబుతున్నారు. గతేడాది డిసెంబర్‌ లోనే సినిమా పూర్తయిందని.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ చేయలేకపోయామని.. సెకండ్ వేవ్ తరువాత కూడా వివిధ సమస్యలు వచ్చాయని ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు.

డిజిటల్ యుగంలో కంటెంట్‌ ని ఎక్కువ కాలం కాపాడుకోవడం కష్టమని.. పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయనే విషయంలో స్పష్టత లేకనే ఓటీటీ రిలీజ్ చేస్తున్నామని 'టక్ జగదీష్' నిర్మాతలు పేర్కొన్నారు. వీరు చెబుతున్న మాట‌ల్ని ఓసారి ప‌క్క‌న పెడితే.. థియేట‌ర్స్ లో ఇప్పుడు భారీ బ‌డ్జెట్ సినిమాల్ని రిలీజ్ చేస్తే రిట‌ర్న్స్ తెచ్చుకోవ‌డం చాలా క‌ష్టమనే విషయం అర్థం అవుతోంది. ఇటీవల విడుదలైన 'తిమ్మరుసు' 'ఎస్ఆర్ క‌ళ్యాణమండ‌పం' 'పాగల్' వంటి చిత్రాలు మంచి టాక్ తెచ్చుకున్నా.. చెప్పుకోద‌గ్గ ప్రాఫిట్స్ రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేవ‌లం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారానే నిర్మాత‌ల‌కి బ్రేక్ ఈవెన్స్ ల‌భించాయని తెలుస్తోంది.

పోయిన వారం విడుదలైన 'రాజ రాజ చోర' సినిమా మిగతా వాటితో పోల్చుకుంటే మంచి వసూళ్ళు రాబడుతోంది. అయినప్పటికీ భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలను ఇప్పుడు రిలీజ్ చేయడం రిస్క్ తో కూడుకున్నదే అని తెలుస్తోంది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో నటించిన 'బెల్ బాటమ్' చిత్రానికి థియేటర్లలో నాలుగు రోజుల్లో నాలుగున్నర కోట్లు మాత్రమే వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేప‌థ్యంలో దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కించిన 'ట‌క్ జ‌గ‌దీష్' చిత్రాన్ని థియేట‌ర్ రిలీజ్ చేస్తే నిర్మాత‌లు ఆర్థికంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

అందుకే నాని చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ ప‌ద్ధతిలో విడుదల చేయ‌డం అన్ని విధాల సరైన నిర్ణయమే అని పలువురు అభిప్రాయప‌డుతున్నారు. కాకపోతే వరుసగా రెండు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయితే నాని థియేట్రికల్ బిజినెస్ మీద కాస్త ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే క్రేజ్ ఉన్న హీరోలందరూ ఓటీటీ బాట పడితే ఎగ్జిబిషన్ వ్యవస్థ కుదేలైపోయే ప్రమాదం కూడా ఉంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో స్టార్స్ - స్టార్ డమ్ అనేది కూడా ఉండదు.

ఇకపోతే 'టక్ జగదీష్' చిత్రాన్ని ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 20న వస్తుందని వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా అధికార ప్రకటన అయితే రాలేదు. అదే రోజు థియేట్రికల్ రిలీజ్ అవుతున్న 'లవ్ స్టోరీ' చిత్రానికి పోటీగా విడుదల చేయొద్దని ఎగ్జిబిటర్స్ కోరుతున్న నేపథ్యంలో.. నాని సినిమా విడుదల విషయంలో ఆలోచిస్తారేమో చూడాలి.

కాగా, ''టక్ జగదీష్'' చిత్రానికి 'మజిలీ' దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ‘నిన్నుకోరి’ తర్వాత నాని - శివ నిర్వాణ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో రీతూవర్మ - ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు - నాజర్ - డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ ఇతర పాత్రలు పోషించారు. థమన్ సంగీతం సమకూర్చారు. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించగా.. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు.