Begin typing your search above and press return to search.

'లైగర్' ఎఫెక్ట్ నుంచి VD బయటకు వచ్చినట్లేనా..?

By:  Tupaki Desk   |   13 Sep 2022 3:30 AM GMT
లైగర్ ఎఫెక్ట్ నుంచి VD బయటకు వచ్చినట్లేనా..?
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ''లైగర్'' సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతాననే ధీమావ్యక్తం చేస్తూ వచ్చాడు. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో వీడీ తీవ్ర నిరాశ చెందాల్సి వచ్చింది. అంతేకాదు అతని ఫ్యూచర్ ప్లానింగ్ విషయంలో మార్పులు తీసుకొచ్చింది.

'లైగర్' మీదున్న నమ్మకంతో ఈ సినిమా విడుదల కాకముందే.. విజయ్ హీరోగా పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ''JGM" (జనగణమన) ను ప్రకటించారు. ఇందులో పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకున్నారు. వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లి రెండు చిన్న షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. దీని కోసం భారీ బడ్జెట్ తో ముంబైలో సెట్ నిర్మించడానికి ప్లాన్ చేశారు.

కానీ, 'లైగర్' బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం చవిచూడటంతో JGM ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. సినిమా నిర్మాణ భాగస్వాములు తప్పుకోవడంతో.. పూరీ మరియు ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేసారని నెట్టింట పుకార్లు పుట్టుకొచ్చాయి.

అయితే పూరి జగన్నాథ్ లేదా ఛార్మీ ఈ రూమర్స్ ను ధృవీకరించలేదు.. అలా అని తిరస్కరించలేదు. విజయ్ దేవరకొండ సైతం 'లైగర్' ప్లాప్ తో పాటుగా 'JGM' క్యాన్సిల్ అవడంపై సైలెంట్ గా ఉంటున్నాడు. కానీ వీడీ 'సైమా' అవార్డ్ ఫంక్షన్ లో హాజరవడంతో ఈ విషయాలపై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

సైమా అవార్డ్స్-2022 వేడుకలు బెంగుళూరులో శని ఆదివారాల్లో అట్టహాసంగా జరిగాయి. మొదటి రోజు జరిగిన తెలుగు కన్నడ సినిమాల అవార్డ్స్ ప్రధానోత్సవంలో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఇందులో యూత్ ఐకాన్ (మేల్) అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఇకపోతే సైమా అవార్డ్స్ మీడియా ఇంటరాక్షన్ లో 'JGM' రూమర్స్ పై స్పందించమని విజయ్ ను జర్నలిస్టులు కోరినట్లు తెలుస్తోంది. అయితే వీడీ ఈ ప్రశ్నను దాటవేస్తూ.. "సైమా అవార్డులను ఆస్వాదించడానికి మేమంతా ఇక్కడ ఉన్నాము. మిగిలిన వాటి గురించి వదిలేసి, ఈ రాత్రిని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయండి'' అని చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి.

ఇకపోతే 'లైగర్' ప్లాప్ తర్వాత మీడియా - సోషల్ మీడియాలకు దూరంగా ఉంటున్న విజయ్.. దాన్నుంచి బయటకు వస్తున్నట్లు అర్థమవుతుంది. సైమా అవార్డ్స్ లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ మరియు కన్నడ హీరో శివ రాజ్ కుమార్ తో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఉత్సాహ పరిచాడు VD.

అంతేకాదు 'సింగిల్ ప్లేయర్' అంటూ ఓ స్టైలిష్ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఎప్పటిగానే సోషల్ మీడియాలో యాక్టీవ్ అయిపోయాడు. 'లైగర్' రిలీజ్ తర్వాత విజయ్ పెట్టిన సాదారణ ట్వీట్ ఇది. అలానే లేటెస్టుగా బ్రెజ్జర్ వివిడ్ షఫుల్ సీజన్-6 కోసం వీడీ ఫోటో షూట్ చేసాడు.

ఇదంతా చూస్తుంటే విజయ్ 'లైగర్' ఎఫెక్ట్ నుంచి బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా, విజయ్ తన వైఫల్యాల గురించి మాట్లాడటానికి ఎప్పుడూ దూరంగా ఉండడు. కాకపోతే లైగర్ మరియు జనగణమ అతను నిశ్శబ్దంగా ఉంటూ వస్తున్నాడు. రాబోయే రోజుల్లో వీటిపై ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.

ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ఖుషి' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.

ఇదే క్రమంలో హరీష్ శంకర్ మరియు రాజ్&డీకే వంటి దర్శకులతో విజయ్ వర్క్ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుకుమార్ సినిమా కంటే ముందుగా మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకోనున్నాడని అంటున్నారు. మరి త్వరలోనే VD నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.