Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో కన్నడ కస్తూరీలు.. మలయాళ ముద్దుగుమ్మలు..!

By:  Tupaki Desk   |   21 April 2022 11:30 PM GMT
టాలీవుడ్ లో కన్నడ కస్తూరీలు.. మలయాళ ముద్దుగుమ్మలు..!
X
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల కంటే పరభాషా నటీమణుల హవానే ఎక్కువ ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు తరం ఫిలిం మేకర్స్ అందరూ తెలుగమ్మాయిలకే ప్రాధాన్యత ఇచ్చారు కానీ.. ఆ తర్వాతి తరంలో మాత్రం బాంబే నుంచి హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకునే ట్రెండ్ మొదలెట్టారు.

ఉత్తరాది భామలు గ్లామర్ షో చేయడానికి వెనకాడరనో.. ఎలాంటి హద్దులు పెట్టకుండా అందాలు ఆరబోస్తారనో తెలియదు కానీ.. మేకర్స్ అంతా వారిపైనే దృష్టి పెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు కాస్త మారాయి. బాంబే భామలతో పాటుగా కన్నడ కస్తూరీలు - మలయాళ ముద్దుగుమ్మలు ఎక్కువగా కనిపిస్తున్నారు.

ఫ్రెష్ నెస్ కోసమో.. మార్కెట్ పరంగా వర్కవుట్ అవుతుందనో కోట్లు కుమ్మరించి మరీ ఇతర ఇండస్ట్రీల నుంచి హీరోయిన్ లను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న వారందరూ బయటి నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. కాకపోతే ఇక్కడ మలయాళ హీరోయిన్ల కంటే కర్ణాటక భామల హవా కాస్త ఎక్కువ నడుస్తోందనే చెప్పాలి.

ప్రస్తుతం ఫుల్ డిమాండ్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. వరుసగా స్టార్ హీరోల పక్కన అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫార్మ్ లో ఉంది. కన్నడ బ్యూటీ కీ రోల్ ప్లే చేసిన 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుండగా.. స్పెషల్ పార్టీ సాంగ్ లో కనిపించనున్న 'ఎఫ్ 3' మూవీ మే 27న రిలీజ్ అవుతోంది. అలానే మహేష్ బాబుతో 'SSMB28'.. పవన్ కళ్యాణ్ తో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలు చేస్తోంది. ఇదే క్రమంలో పలు హిందీ సినిమాల్లోనూ నటిస్తోందీ బుట్టబొమ్మ.

రష్మిక మందన్నా కూడా తెలుగులో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 'పుష్ప' తో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. తమిళ కన్నడ హిందీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం విజయ్ సరసన 'తలపతి66' అనే తెలుగు తమిళ ద్విభాషా చిత్రం చేస్తోంది. అలానే దుల్కర్ సల్మాన్ సినిమా 'సీతా రామం' లో కీలక పాత్రలో కనిపించనుంది. అల్లు అర్జున్ తో 'పుష్ప: ది రూల్' అనే పాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేయనుంది. ఇక హిందీలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగం కానుంది.

'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ఇప్పుడు అస్సలు ఖాళీగా లేదు. ప్రస్తుతం అర డజనుకు పైగా ప్రాజెక్ట్స్ తో అమ్మడు బిజీగా మారిపోయింది. రవితేజ తో 'ధమాకా'.. నవీన్ పోలిశెట్టి తో 'అనగనగా ఒక రాజు' సినిమాలలో హీరోయిన్ గా సందడి చేస్తోంది. వారాహి బ్యానర్ లో గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా లాంచ్ అవుతున్న సినిమాలో శ్రీ లీలనే హీరోయిన్. 'నితిన్ - వక్కంతం వంశీ' సినిమా.. దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెండో సినిమా 'సెల్ఫిష్'.. వైష్ణవ్ తేజ్ సినిమాలు శ్రీ లీల లైనప్ లో ఉన్నాయి.

కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి 'ఉప్పెన'లా వచ్చిన కృతి శెట్టి.. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం సుధీర్ బాబుతో 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి'.. రామ్ పోతినేని సరసన 'ది వారియర్'.. నితిన్ తో కలిసి 'మాచర్ల నియోజకవర్గం' వంటి సినిమాలలో కృతి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక 'కేజీయఫ్' ఫ్రాంచైజీతో సత్తా చాటిన శ్రీనిధి శెట్టి కూడా ఇప్పుడు రేసులోకి వస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు అమ్మడి తలుపు తడుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో పుట్టి బెంగుళూరులో పెరిగిన నిధి అగర్వాల్.. 'హరి హర వీరమల్లు' సినిమా తర్వాత క్రేజీ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది.

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం నిఖిల్ తో కలిసి బ్యాక్ టూ బ్యాక్ '18 పేజెస్' మరియు 'కార్తికేయ 2' వంటి రెండు సినిమాలు చేస్తోంది. అలానే మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమా చేస్తోంది. అలానే నాని నటిస్తున్న 'దసరా' అనే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

మాలీవుడ్ గార్జియస్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం అల్లు శిరీష్ తో 'ప్రేమ కాదంట'.. అలానే మాస్ మహారాజా రవితేజ సరసన 'రావణాసుర' చిత్రంలో అను హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.