Begin typing your search above and press return to search.

కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి వైఫ్ కు గాయాలు.. అదెలానంటే?

By:  Tupaki Desk   |   17 Jan 2023 4:31 AM GMT
కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి వైఫ్ కు గాయాలు.. అదెలానంటే?
X
బాలీవుడ్ స్టార్ డైరక్టర్ గా వెలుగొందుతున్న వివేక్ అగ్నిహోత్రి సతీమణి పల్లవి జోషి గాయాల బారిన పడ్డారు. చిత్ర షూటింగ్ లో భాగంగా కారు చేజింగ్ సీన్ చేస్తున్న ఆమెకు గాయాలయ్యాయి. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గుర్తున్నారా? ఒక్క సినిమాతో యావత్ దేశస్తుల నోళ్లలో నానటమే కాదు.. ఆయన పేరు ఒక బ్రాండ్ గా మారింది. కశ్మీర్ ఫైల్స్ మూవీతో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు.. ఇంతకాలం వినిపించే వాదనకు భిన్నంగా ధైర్యంగా జరిగిన సత్యాన్ని ప్రపంచానికి చెప్పేయటం ఆయన్ను కోట్లాది మందికి దగ్గర చేసింది.

ఇంతకాలం వామపక్ష భావజాలంతో విషయాల్ని తమకు తగ్గట్లుగా చెప్పుకునే తీరుకు భిన్నంగా.. చరిత్రలో జరిగిన మారణహోమాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిన వివేక్ అగ్నిహోత్రి ధైర్యం అందరిని ఆకర్షించేలా చేసింది. ఇప్పటివరకు ఏడు సినిమాలు చేసిన అతడు.. ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తున్నారు. అందులో ఒకటి ది వ్యాక్సిన్ వార్ అయితే.. మరొకటి ది ఢిల్లీ ఫైల్స్.

కరోనా వేళ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫార్మాకంపెనీలైన మొడెర్నా.. ఫైజర్ వ్యాక్సిన్లను భారత్ లోకి రప్పించేందుకు జరిగిన ప్రయత్నాలు.. దాన్ని మోడీ సర్కారు అడ్డుకొని.. స్వదేశీ వ్యాక్సిన్లను ప్రోత్సహించి.. భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత మేలు చేశారన్న విషయాన్ని తనదైన శైలిలో చెప్పే చిత్రమే ది వ్యాక్సిన్ వార్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీని చూసినప్పుడు ప్రో మోడీ అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

అయితే.. ఇంతకాలం వామపక్ష భావజాలంతో ఉన్న బాలీవుడ్ దర్శకులు చెప్పిన కథల్ని సినిమాలుగా చూసిన దేశ ప్రజలకు.. జాతీయవాదుల తరఫున నిలిచే వారు పెద్దగా లేని పరిస్థితి. అలాంటి తీరుకు బ్రేక్ ఇవ్వటంలో ప్రధాని నరేంద్ర మోడీ విజయం సాధించారని చెప్పాలి.

గడిచిన ఎనిమిదన్నరేళ్లలో చూస్తే.. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలకు సంబంధించి ఇప్పటివరకు రాని కథలతో చిత్రాలుగా మలిచే ఒక ప్రక్రియ మొదలైంది. ఇలాంటి సాహసాలకు మోడీ సర్కారు అండగా నిలవటంతో.. చరిత్రలో జరిగిపోయిన ఎన్నో ఉదంతాలకు సంబంధించిన కొత్త కోణాలు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

అలా తీసుకొస్తున్న కొద్ది మంది దర్శకుల్లో ముందుంటారు వివేక్ అగ్నిహోత్రి. ఇక.. తాజాగా జరిగిన యాక్సిడెంట్ విషయానికి వస్తే.. వివేక్ అగ్నిహోత్రి సైతం సినిమాల్లోయాక్ట్ చేస్తుంటారు. భర్త చేసే సినిమాల్లో నటించే పల్లవి జోషి.. తాజాగా ఆయన చేస్తున్న ది వ్యాక్సిన్ వార్ మూవీలోనూ నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. షూటింగ్ లో గాయపడ్డ పల్లవి జోషి.. షూటింగ్ కు అంతరాయం కలగకుండా చూసుకునేందుకు గాయాలతోనే తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసి ఆసుపత్రికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

పని పట్ల కమిట్ మెంట్ ఉండేవారి తీరు ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనమే ఈ ఉదంతంగా చెప్పొచ్చు. ఇక.. వ్యాక్సిన్ వార్ మూవీ విషయానికి వస్తే.. అందులో కాంతారా ఫేం సప్తమి గౌడ్ కూడా నటిస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మాదిరే.. ది వ్యాక్సిన్ వార్ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటంతో పాటు.. హాట్ చర్చకు తావిస్తుందని మాత్రం చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.