Begin typing your search above and press return to search.

కోన చెప్పిన జనవరి 15 మతలబేంటి?

By:  Tupaki Desk   |   8 Jan 2018 7:07 AM GMT
కోన చెప్పిన జనవరి 15 మతలబేంటి?
X
మహేష్ కత్తి.. పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వాదోపవాదాలు తీవ్ర స్థాయికి చేరి.. ఈ గొడవ మరో స్థాయికి వెళ్లేలా కనిపిస్తున్న తరుణంలో టాలీవుడ్ సీనియర్ రైటర్.. పవన్ కళ్యాణ్ మిత్రుడు కోన వెంకట్ లైన్లోకి వచ్చాడు. పవన్ మౌనాన్ని తేలిగ్గా తీసుకోవద్దని.. ఇక ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని మహేష్ కత్తిని సున్నితంగా హెచ్చరించాడు కోన. ఈ సందర్భంగా అభిమానులు కూడా సంయమనం పాటించాలని కోన కోరాడు. జనవరి 15 వరకు అందరూ సైలెంటుగా ఉండాలని కోన చెప్పడం విశేషం.

మౌనం అనేది నిజమైన స్నేహితుడని.. అది ఎప్పటికీ మోసం చేయదని.. జనవరి 15 వరకు అంతా మౌనంగా ఉండాలని.. ఈ విషయంలో కత్తి మహేష్ కు కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నా అని.. దయచేసి మీడియా ఛానెళ్లకు వెళ్లి చర్చల్లో పాల్గొనడం.. పవన్.. పవన్ అభిమానులకు వ్యతిరేకంగా మాట్లాడటం చేయొద్దని కోరుతున్నానని.. అలా చేస్తే శాంతి చేకూర్చాలన్న ప్రయత్నం విఫలమవుతుందని కోన అన్నాడు. మరి కోన జనవరి 15ను డెడ్ లైన్ గా పెట్టడంలో మతలబు ఏంటన్నది అర్థం కావడం లేదు. ఊరికి ఒక వారం రోజులు ఇలా బ్రేక్ తీసుకుంటే.. అందరూ ఈ ఇష్యూను మరిచిపోయి ఎవరి పనుల్లో వాళ్లు పడిపోతారన్నది కోన ఉద్దేశమా.. లేక జనవరి 15న పవన్ ఈ విషయమై నేరుగా రంగంలోకి దిగి ఏదైనా మాట్లాడటం చేస్తారా అని ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఈ వివాదం మరీ హద్దులు దాటిపోయిందని.. ఇంతటితో దీనికి ముగింపు పలకాలని అందరూ కోరుకుంటున్నారు.