Begin typing your search above and press return to search.

'ఇది భీమ్లా పై దాడి కాదు.. థియేటర్ల వ్యవస్థ మీద దాడి'

By:  Tupaki Desk   |   25 Feb 2022 7:07 AM GMT
ఇది భీమ్లా పై దాడి కాదు.. థియేటర్ల వ్యవస్థ మీద దాడి
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో 'భీమ్లా నాయ‌క్' మేనియా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానుల హంగామాతో పండుగ వాతావరం కనిపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలు మరియు థియేటర్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. జీవో నెం. 35 ప్రకారమే సినిమా ప్రదర్శించాలని.. అదనపు షోలు వేసినా, అధిక ధరలకు టిక్కెట్లు అమ్మినా థియేటర్లను సీజ్ చేస్తామ‌ని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.

స్థానిక పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు 'భీమ్లా నాయక్' ప్రదర్శించబడే థియేటర్లను త‌నిఖీలు చేప‌డుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోల ప్రకారం కొన్ని థియేటర్ల దగ్గర పోలీసులతో పాటుగా సీఆర్పీఎఫ్ జవాన్లు కన్పించడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ మీద కక్ష గట్టి ఏపీ ప్రభుత్వం ఇలా రూల్స్ పేరుతో ‘భీమ్లా నాయక్’ ప్రదర్శితం కాకుండా అడ్డుకుంటున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది సినిమా నిర్మాతలు ఆర్టిస్టుల మీద జరుగుతున్న దాడి కాదని.. థియేటర్ వ్యవస్థ మీద దాడి అని అన్నారు. థియేటర్ల వ్యవస్థ మీద దాడి చాలా కలిచివేస్తోందని.. ఈ రాష్ట్రంలో థియేటర్లు ఉన్నప్పుడు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. పవన్ పై దాడి చేయాలనుకుంటే రాజకీయంగా చేయాలని.. కానీ ఇలా ఆంక్షలు విధించడం వల్ల ఎగ్జిబిటర్ల వ్యవస్థకే నష్టం చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. తమిళనాడు నుంచి ఎంతో కష్టపడి ఇండస్ట్రీని ఇక్కడకు తీసుకువచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.

''థియేటర్ లపై మీరు చేస్తోన్న దాడి సరైంది కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎలా మీవాళ్లు అవుతారో ఇక్కడ ఉన్న ఎగ్జిబిటర్లు కూడా మీవాళ్లే. దయచేసి మీరు అర్ధం చేసుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ పై లేదా నిర్మాతల పై దాడి కాదు. అధికారులపై ఒత్తిడి తెచ్చి, వాళ్లని థియేటర్ల వద్ద కూర్చొ పెట్టాల్సిన అవసరం లేదు. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఐదారు సార్లు కూర్చున్నాం. కలిసి మా బాధలు చెప్పుకున్నాం. వీళ్ళు ఇచ్చిన జీవో ఇండియాలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మేం యాక్సెప్ట్ చేస్తాం''

''ఇప్పటివరకూ వచ్చిన మూడు కరోనాల వల్ల బాగా ఇబ్బందులు పడ్డాం. దాని కన్నా ఎక్కువగా ఇప్పుడు ఎగ్జిబిటర్ల వ్యవస్థపై దాడి చేస్తున్నారు. ఇది సినిమా నిర్మాతలు ఆర్టిస్టుల మీద జరుగుతున్న దాడి కాదు.. థియేటర్ వ్యవస్థ మీద దాడి చేస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. 10 గంటల వరకూ షో వేయొద్దని నోటీసులు ఇచ్చారు. దానికి అనుగుణంగానే మేము ఉన్నాం. అందరం జీవోని ఫాలో అవ్వాల్సిందే. దాన్ని అధికారం ఎవ్వరికీ లేదు. అయినా అధికారులు మళ్లీ థియేటర్లపై దాడి చేస్తూ మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు. అదే బాధగా ఉంది''

''మేం దొంగలం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏపీలో ఉన్న సినిమా ఎగ్జిబిటర్లను ఏం చేయాలనుకుంటున్నారో ఓపెన్ గా చెప్పేయండి. పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగతం.. రాజకీయంగా చూసుకోండి. కానీ థియేటర్ల వ్యవస్థ పై దాడి చేస్తున్నారు. థియేటర్ల ఓనర్లు ఏం చేశారని మీరు ఇలా చేస్తున్నారు?. ఇది పవన్ మరియు బీమ్లా నాయక్ సినిమా మీద దాడి కాదు.. థియేటర్ల మీద దాడి. ఈ దాడుల వల్ల పవన్ కల్యాణ్ కు ఎలాంటి నష్టం ఉండదు. థియేటర్ల వ్యవస్థకు నష్టం. దీన్ని కాపాడుకుంటే వాళ్ళు కోరుకున్న విధంగా ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడికి షిప్ట్ అవుతుంది'' అని ఎన్వీ ప్రసాద్ చెప్పుకొచ్చారు.