Begin typing your search above and press return to search.

సౌత్ పై చెత్త కామెంట్లు.. ఏరు దాటాక తెప్పతగలేయడం అంటే ఇదే..!

By:  Tupaki Desk   |   31 March 2022 4:30 AM GMT
సౌత్ పై చెత్త కామెంట్లు.. ఏరు దాటాక తెప్పతగలేయడం అంటే ఇదే..!
X
సౌత్ లో రాణించే ప్రతీ హీరోయిన్ ఫైన‌ల్ డెస్టినేషన్ బాలీవుడ్ అనే చెప్పాలి. క్రేజ్ కోసమో రెమ్యూనరేషన్ కోసమో కానీ అందరూ హిందీ చిత్ర పరిశ్రమ మీద మోజు పడుతుంటారు. దక్షిణాదిలో ఫేమ్ వచ్చాక.. ఉత్తరాదికి వెళ్లి నిలదొక్కుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

అయితే వారిలో సౌత్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి.. కాస్తో కూస్తో ఫేమ్ నేమ్ వచ్చాక బాలీవుడ్ చెక్కేసి అదే సౌత్ సినిమాను విమర్శించిన హీరోయిన్లు కొందరు ఉన్నారు. ఏరు దాటాక తెప్పతగలేస్తూ దక్షిణాది మీద ఇష్టమొచ్చిన కామెంట్స్ చేసిన హీరోయిన్ల జాబితాలో రీసెంటుగా రాశీ ఖన్నా కూడా చేరింది.

కెరీర్‌ బిగినింగ్ లో సౌత్ ఇండస్ట్రీలో తనను గ్యాస్‌ ట్యాంకర్‌ అంటూ వెక్కిరించారని రాశీఖన్నా తెలిపింది. సౌత్ లో అడుగుపెట్టిన తరువాత తను రొటీన్ ఫార్ములాకు అలవాటు పడ్డానని.. తనను అలా మార్చేశారని చెప్పింది. కమర్షియల్ సినిమాల్లో హీరోల పక్కన కొద్దిసేపు కనిపించడం, పక్కకు వెళ్లిపోవడం లాంటి రొటీన్ ఫార్ములాను తనకి అలవాటు పడేలా చేశారని చెప్పుకొచ్చింది.

దక్షిణాదిలో హీరోయిన్లను టాలెంట్ తో కాకుండా లుక్స్ పరంగా గుర్తింపునిస్తారని.. అది తనకు నచ్చదని తెలిపింది. కొంచెం తెల్లగా ఉంటే చాలు మిల్కీ బ్యూటీ అనేస్తారని.. కానీ అంతకుమించిన టాలెంట్ హీరోయిన్స్ లో ఉంటుందని.. ఇప్పటికైనా దాన్ని సౌత్ ఆడియన్స్ గుర్తించాలని రాశి ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

రాశీఖన్నా చేసిన ఈ కామెంట్స్ పై సౌత్ సినీ అభిమానులు మండిపడుతున్నారు. గుర్తింపు తెచ్చిపెట్టిన ఇండస్ట్రీని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయిందంటూ అమ్మడిపై ఫైర్ అవుతున్నారు. నిజానికి 'మద్రాస్ కేఫ్' అనే హిందీ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన రాశీకి 'ఊహలుగుసగుసలాడే' సినిమాతో హీరోయిన్ గా సక్సెస్ అందించింది టాలీవుడ్.

అప్పటి నుంచి వరుసగా అవకాశాలు అందుకుంటూ.. తెలుగు, తమిళ, మళయాళ హీరోలతో నటిస్తూ వచ్చింది. ఇప్పడు 'రుద్ర' అనే వెబ్ సిరీస్ తో మళ్లీ బాలీవుడ్ కి జంప్ అయ్యింది. అక్కడ ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయేమో సౌత్ ఇండస్ట్రీ వల్ల తనలో ఇంత టాలెంట్ ఉందనే విషయమే మర్చిపోయాననే విధంగా నోరు పారేసుకొని ఇక్కడి ఫాన్స్ ఆగ్రహానికి గురవుతోంది.

రాశీ ఖన్నా మాదిరిగానే గతంలో పలువురు హీరోయిన్లు దక్షిణాది చిత్ర పరిశ్రమ మీద కామెంట్లు చేశారు. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న పూజాహెగ్డే.. ఆ మధ్య సౌత్ మీద అనవసరమైన వ్యాఖ్యలు చేసింది. ఇక్కడి ఆడియన్స్ కి నడుము అంటే చాలా ఇష్టమని.. మిడ్ డ్రెస్ ల్లోనే చూడాలనుకుంటారని.. సినిమాల్లో కచ్చితంగా హీరోయిన్ నడుము మీదే కాన్సన్ట్రేట్ చేస్తారని పూజా తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

వాస్తవానికి పూజా కెరీర్ ప్రారంభంలో 'మాస్క్' 'మొహంజదారో' వంటి బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ తో ఐరెన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. అలాంటప్పుడే 'ఒక లైలా కోసం' సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చి.. సక్సెస్ అందించింది టాలీవుడ్. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ వయా కోలీవుడ్ అన్నట్లు బిజీగా గడుపుతోంది. అయితే స్టార్ డమ్ తెచ్చి పెట్టిన సౌత్ లో నడుము - నావెల్ లనే చూస్తారని కామెంట్స్ చేసి విమర్శలు ఎదుర్కొంది.

కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'ఝుమ్మందినాధం' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను.. తర్వాతి రోజుల్లో దర్శకుడి పైనా సౌత్ ఇండస్ట్రీ మీద ఇలాంటి కామెంట్లే చేసింది. ఇక్కడ టాలెంట్ కన్నా గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని.. అందరూ నడుము మీదే కాన్సన్ట్రేట్ చేస్తారన్నట్లు వ్యాఖ్యానించింది. రాఘవేంద్రరావు హీరోయిన్ బొడ్డు మీద పండ్లు కూరగాయలు వేయడపంపై కూడా నెగెటివ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రాణిస్తున్న తాప్సి.. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలుగులో ఓ సినిమాతో పలకరించబోతోంది.

బాలీవుడ్ లో బోల్డ్ క్యారెక్టర్స్ చేసే హీరోయిన్ రాధికా ఆప్టే కూడా సౌత్ ఇండస్ట్రీ మీద నోరు పారేసుకుంది. రెండు గంటల ముందే సెట్ కి పిలిపించి వెయిట్ చేయిస్తారని.. హీరోయిన్ అంటే గ్రాంటెడ్ గా తీసుకుని బిహేవ్ చేస్తారని సౌత్ ఇండస్ట్రీ మీద కామెంట్ చేసింది. స్కిన్ షో చేస్తే సౌత్ జనాలు ఫ్లాటయిపోతారంటూ పనికి రాని కామెంట్స్ చేసింది. ఇలా అవకాశాలు అందించిన దక్షిణాది మీద ఇలా నోటికొచ్చింది మాట్లాడిన అభిమానుల ఆగ్రహానికి గురైన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.