Begin typing your search above and press return to search.

పెళ్లైన 30 ఏళ్లకు.. అప్పటి రోజుల్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టిన స్టార్ నటి

By:  Tupaki Desk   |   2 March 2022 5:45 AM GMT
పెళ్లైన 30 ఏళ్లకు.. అప్పటి రోజుల్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టిన స్టార్ నటి
X
ఒకే ఒక్క సినిమా. దాంతో యావత్ దేశమంతా ఆమె గురించి మాట్లాడుకునేలా చేయటమే కాదు.. ఆమె ఓకే చెప్పాలే కానీ.. బ్లాంక్ చెక్ తో బారులు తీరిన నిర్మాతలు ఉన్నారు. ఆమె ఎవరో కాదు.. హిందీలో మైనే ప్యార్ కియా.. తెలుగులో ప్రేమ పావురాలతో వెండితెరకు.. ప్రేక్షక కోటికి పరిచయమైన భాగ్యశ్రీ. కండల వీరుడు సల్మాన్ ఖాన్.. భాగ్యశ్రీలు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ మూవీతోనే.

ఈ ఇద్దరు ఈ సినిమాతో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. సినిమా షూటింగ్ జరిగే సమయానికి భాగ్యశ్రీ.. పీకల్లోతు ప్రేమలో ఉండటం.. తాను ప్రేమించిన హిమాలయ దస్సానిని పెళ్లాడటం తెలిసిందే.

పెళ్లి తర్వాత సినిమాలకు ఒప్పుకోని కారణంగా.. బోలెడంత స్టార్ డమ్ వచ్చినప్పటికీ.. క్రేజీ ఆఫర్లు తలుపు తట్టినప్పటికి తన కెరీర్ ను పెళ్లి కోసం త్యాగం చేసింది. ఆమె నటించే మరో సినిమా కోసం ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూశారు. చివరకు భాగ్యశ్రీ కండీషన్ మేరకు.. ఆమెతో సినిమా చేయటానికి ఆమె భర్తను హీరోగా పెట్టి సినిమా తీశారు. అయితే.. ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవటంతో.. ఆ ఫార్ములా రెండు.. మూడు సినిమాలకు ముగిసింది.

అయినప్పటికీ ఆమెకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. తర్వాతి కాలంలో సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్న ఆమె.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. హీరోయిన్ గా భాగ్యశ్రీకి వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఒక ఎత్తు అయితే.. ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. 2015లో మహారాష్ట్ర ప్రభుత్వం షురూ చేసిన భాగ్యశ్రీ స్కీంకు ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయటం విశేషం.

తాజాగా ప్రముఖ ఛానల్ స్టార్ ప్లస్ నిర్వహిస్తున్న సరికొత్త రియాలిటీ షో స్మార్ట్ జోడీలో భాగ్యశ్రీ దంపతులు పాల్గొన్నారు. ఈ షోలో తాజాగా.. దాదాపు ముఫ్పైఏళ్లకు ముందు జరిగిన పెళ్లి ముచ్చట్లను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హిమాలయతో పెళ్లికి తమ తల్లిదండ్రులు ఒప్పుకోలేదని.. ఎవరూ ఎలాంటి సపోర్టు ఇవ్వలేదన్నారు. తమ పెళ్లి సమయానికి తాను.. హిమాలయ తప్పించి ఇంకెవరూ లేరన్న ఆమె ఎమోషనల్ అవుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లల గురించి కలలు కంటారు. కానీ.. పిల్లలకు కూడా సొంత కలలు ఉంటాయని.. వారి కలల్ని సాకారం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఎందుకంటే.. చివరకు వారి జీవితాన్ని వారే జీవించాలి కాబట్టి అని చెప్పుకొచ్చారు. ఒక సమయంలో తాను.. హిమాలయ ఇద్దరం లేచిపోయామన్న పుకార్లు కూడా పుట్టించారని.. కానీ తాముఅలా చేయలేదన్నారు. మొత్తానికి తన పెళ్లి నాటి ముచ్చట్లను షేర్ చేసుకునే వేళ భాగ్యశ్రీ ఎమోషన్ చాలామందిని కదిలించేసింది.