Begin typing your search above and press return to search.

ఐదేళ్ల బాహుబలి ప్రయాణం ముగిసింది

By:  Tupaki Desk   |   1 March 2017 3:21 PM IST
ఐదేళ్ల బాహుబలి ప్రయాణం ముగిసింది
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ తెలుగు వెర్షన్ సంగతేమో కానీ.. తమిళంలో మాత్రం ఈ చిత్రానికి డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్ర తమిళ వెర్షన్ కు అన్నీ తానై వ్యవహరిస్తున్న మదన్ కార్కీ ఈ సంగతి వెల్లడించాడు. ఐదేళ్లుగా బాహుబలి సినిమాతో సాగుతున్న అద్భుత ప్రయాణం ముగిసిందని.. ‘ది కంక్లూజన్’కు డబ్బింగ్ పూర్తి చేశామని కార్కీ ట్విట్టర్లో ప్రకటించాడు. లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తు కొడుకైన మదన్ కార్కీ తండ్రికి తగ్గ తనయుడిగానే పేరు తెచ్చుకున్నాడు. పాటలతో పాటు మాటల రచయితగానూ ఫేమస్ అయ్యాడు. ‘బాహుబలి’ తమిళ వెర్షన్‌ బాధ్యతల్ని అతడికే అప్పగించాడు రాజమౌళి.

తెలుగు నుంచి తమిళంలోకి డబ్బింగ్ అంటే.. తెలుగు డైలాగుల్ని తమిళంలోకి అనువాదం చేయడం కాకుండా సన్నివేశాలకు తగ్గట్లుగా తమిళంలో ప్రత్యేకంగా డైలాగులు రాశాడు మదన్. అంతే కాదు.. ఈ సినిమా కోసం అతను ‘కిలికి’ అనే కొత్త భాషనే తయారు చేశాడు. దానికి లిపి కూడా రాశాడు. ‘బాహుబలి’ అన్ని వెర్షన్లలోనూ కాలకేయులు ఈ కిలికి భాషే మాట్లాడతారు. ఆ భాష ఎంత పాపులరైందో తెలిసిందే. ఇలా ఓ రచయిత మరో భాషకు చెందిన సినిమా కోసం ఐదేళ్ల పాటు ప్రయాణం చేయడం అరుదైన విషయమే. ఈ నెలాఖరుకల్లా ‘బాహుబలి’ అన్ని వెర్షన్లలోనూ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీలతో రెడీ అయిపోతుందని సమాచారం. మూడు వారాల పాటు ప్రమోషన్లు చేసి.. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/