Begin typing your search above and press return to search.

త‌మిళ న‌టుడిని పెళ్లాడిన మ‌ధుశాలిని

By:  Tupaki Desk   |   18 Jun 2022 4:31 AM GMT
త‌మిళ న‌టుడిని పెళ్లాడిన మ‌ధుశాలిని
X
తెలుగ‌మ్మాయి.. అందాల న‌టి మధుశాలిని స‌హ‌నటుడు గోకుల్ ఆనంద్ ను వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లో కుటుంబసభ్యులు.. బంధుమిత్రుల సమక్షంలో వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. తాజాగా కొత్తగా పెళ్లయిన జంట ఫోటోను మధు శాలిని ట్విట్టర్ లో షేర్ చేసారు. ''మాకు లభించిన ప్రేమకు ధన్యవాదాలు. జీవితంలోని కొత్త అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. లవ్ మధు షాలిని & గోకుల్... ఆశ కృతజ్ఞతతో'' అంటూ ట్వీట్ చేసారు.

న‌వ‌ వధువు ఎరుపు రంగు వెల్వెట్ దుస్తులలో అద్భుతంగా కనిపించగా.. వరుడు ట్రెడిష‌న‌ల్ దుస్తులలో క‌నిపించారు. కొత్త జంట‌ పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. నెటిజనులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ జంట 2019 తమిళ డ్రామా 'పంచాక్ష‌రం'లో క‌లిసి న‌టించారు. 2019 డిసెంబర్ 27న విడుదలైన ఈ చిత్రాన్ని పారడాక్స్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో వైరముత్తు నిర్మించారు. బాలాజీ వైరముత్తు దర్శకుడు.

ఈ చిత్రంలో సంతోష్ ప్రతాప్ కథానాయకుడు కాగా గోకుల్- మ‌ధుశాలిని ఇత‌ర‌ పాత్ర‌ల్లో నటించారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశపు మొట్టమొదటి సైకలాజికల్ సూపర్ నేచురల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకుంది. ఈ మూవీలో న‌టించే క్ర‌మంలోనే గోకుల్ -మ‌ధుశాలిని న‌డుమ ప్రేమ చిగురించింది. అనంత‌రం డేటింగ్ ని కొన‌సాగించారు.

న‌టుడు గోకుల్ ఆనంద్ 2017 తమిళ చిత్రం 'చెన్నై 2 సింగపూర్‌'తో నటుడిగా కెరీర్ ను ప్రారంభించాడు. తరువాత 2021 మిస్టరీ చిత్రం 'తిట్టమ్ ఇరందు' తో పాటు అదే ఏడాది 'నడువన్'లో చిన్న పాత్రలలో కనిపించాడు. మ‌ధుశాలిని ప‌లు తెలుగు చిత్రాల్లో స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టించింది. అంద‌రి వాడు చిత్రంలో న‌టించిన మ‌ధుశాలిని ఆ త‌ర్వాత నా ప్రాణం కంటే ఎక్కువ‌- నాయ‌కుడు-ఒక విచిత్రం-జ‌గ‌డం- కింగ్- అనుక్ష‌ణం-గోపాల గోపాల-గూఢచారి త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది.

విశాల్ - ఆర్య న‌టించిన 'వాడు వీడు'(అవ‌న్ ఇవ‌న్‌)లోనూ మ‌ధు ఒక ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. చివరిగా '9 అవర్స్' అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఈ ఏడాది జూన్ 2న OTT ప్లాట్ ఫారమ్ లో విడుదలైన ఈ సిరీస్ కు నిరంజన్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ధరణీధరన్ తెర‌కెక్కించిన 'రేంజ‌ర్' మూవీలో మ‌ధుశాలిని న‌టించింది. ఇందులో సిబిరాజ్- ర‌మ్యా నంబేసన్ లాంటి స్టార్ల‌తో క‌లిసి న‌టించింది. త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల‌కు రానుంది.