Begin typing your search above and press return to search.

మనోజ్ రెండో పెళ్లిపై సోదరి మంచు లక్ష్మి స్పందన..!

By:  Tupaki Desk   |   10 Oct 2022 7:32 AM GMT
మనోజ్ రెండో పెళ్లిపై సోదరి మంచు లక్ష్మి స్పందన..!
X
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లిపై గత కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దివంగత భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో మనోజ్ వివాహం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వినాయక చవితి సందర్భంగా మనోజ్ - మౌనిక కలిసి సీతాఫలమండిలోని వినాయక మండపానికి రావడ ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది.

ఇదే విషయం మీద మంచు మనోజ్ ను ప్రశ్నించగా.. ''అది వ్యక్తిగత విషయం.. మంచి రోజు వచ్చినప్పుడు నేనే మీ అందరికీ తెలియజేస్తాను. సినిమాలు.. పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా త్వరలోనే చెప్తాను'' అని తెలిపారు. అప్పటి నుంచి మనోజ్ - మౌనిక రెడ్డి రెండో పెళ్లి గురించి ఇటు సినీ వర్గాల్లో అటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సోదరుడు మనోజ్ రెండో పెళ్లి పై నటి మంచు లక్ష్మి స్పందించింది. తన పుట్టినరోజుని పురస్కరించుకుని ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో తమ్ముడి వివాహంపై మాట్లాడుతూ.. 'ఎవరి బ్రతుకు వారిని బతకనివ్వండి' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'మనోజ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఆయన త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?' అని ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నించగా.. "ఎవరి బ్రతుకు వారిని బతకనివ్వండి. ఈ రోజుల్లో నిస్వార్థమైన నిజాయతీ కలిగిన ప్రేమను పొందడం చాలా కష్టం. మనోజ్ అలాంటి ప్రేమను పొందుతున్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. మనోజ్ కు ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి" అని మంచు లక్ష్మీ వ్యాఖ్యానించారు.

మంచు మనోజ్ నటుడిగా కెరీర్ లో బిజీగా ఉన్నప్పుడు ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లకు ఇద్దరికీ కుదరకపోవడంతో పరస్పర అంగీకారంతో వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు భూమా మౌనిక రెడ్డి కూడా తన మాజీ భర్త నుంచి విడాకులు తీసుకుంది. అయితే ఇప్పుడు మనోజ్ - మౌనిక పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు లక్ష్మీ మంచు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

అలానే ఇటీవల కాలంలో మంచు ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై కూడా మంచు లక్ష్మీ స్పందించింది. 'అవి పనికిరాని విషయాలు. ఒక వ్యవస్థలో ఒకరు బాగున్నారంటే...అతని పై బురద జల్లడానికి మరొకరు సిద్ధంగా ఉంటారు. ఒక రంగంలోకి వచ్చాక మంచితోపాటు చెడును కూడా ఆహ్వానించాలి' అని పేర్కొన్నారు.

'ఇండస్ట్రీలో హీరోలందరూ బాగానే ఉంటారు. కానీ ఈ ఫ్యాన్స్ ఎందుకంతలా కొట్టుకుంటారో నాకు అర్థం కాదు. కొంతమంది ఎప్పుడూ నెగెటివిటీతోనే ఆలోచిస్తారు. నువ్వు ఎంత మంచి చేసినా వాళ్లు చెడుగానే చూస్తుంటారు. అయినా పర్వాలేదు. ప్రతీది మనకు ఏదొక పాఠం నేర్పిస్తుంది. ప్రతి అనుభవం నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి' అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.

ఇకపోతే లక్ష్మి మంచు ప్రస్తుతం 'అగ్ని నక్షత్రం' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో తన తండ్రి మోహన్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. దీనితోపాటు 'మాన్ స్టర్' అనే మలయాళం మూవీతో మాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. మోహల్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో లక్ష్మీ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక 'ఆహా' ఓటీటీ కోసం 'చెఫ్ మంత్ర' సీజన్-2 కు ఆమె హోస్టుగా వ్యవహరిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.