Begin typing your search above and press return to search.

మంచు విష్ణు రివర్స్ ట్వీట్.. కాసేపటికే డిలీట్.. రీజన్ ఏంటి..?

By:  Tupaki Desk   |   11 Feb 2022 3:07 AM GMT
మంచు విష్ణు రివర్స్ ట్వీట్.. కాసేపటికే డిలీట్.. రీజన్ ఏంటి..?
X
సినీ ఇండస్ట్రీలో సమస్యల మీద టాలీవుడ్ ప్రముఖులు గురువారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. చిరంజీవితోపాటుగా ఆర్ నారాయణమూర్తి - మహేష్ బాబు - ప్రభాస్ - ఎస్ఎస్ రాజమౌళి - కొరటాల శివ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఈ మీటింగ్ లో మంచు మోహన్ బాబు - మంచు విష్ణు ఎందుకు కనిపించలేదనే విషయం మీద వార్తలు వస్తున్న నేపథ్యంలో.. 'మా' అధ్యక్షుడు ఓ ట్వీట్ చేసి డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే గురువారం మిర్రర్ లో చూసి చదివే మాదిరిగా ట్విట్టర్ లో రివర్స్‌ లో ఓ ట్వీట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. కాకపోతే ఆ తర్వాత కొద్దిసేపటికే దాన్ని డిలేట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ''మీరు దీన్ని సులభంగా చదవగలిగితే.. బ్యాక్‌ వర్డ్స్‌ లో అద్భుతంగా చదవగలిగే శక్తి ఉన్నట్టే. పాయింట్ లెస్ టాలెంట్ మీలో ఉన్నట్టే..'' అనేది ఈ ట్వీట్ సారంశం.

ఇప్పుడు విష్ణు అలాంటి రివర్స్ ట్వీట్ ఎందుకు చేశారు? మళ్ళీ ఎందుకు డిలీట్ చేసారనేది? ప్రశ్నార్థకంగా మారింది. అందులోనూ చిరంజీవి నేతృత్వంలోని సినీ బృందం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ను కలిసిన వేళ.. ఈ ట్వీట్ చేయడం, వెంటనే దాన్ని తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జగన్ తో చిరు భేటీ పర్సనల్ విష్ణు కామెంట్ చేశారు. ఈ క్రమంలో మరోసారి తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడి వచ్చారు మెగాస్టార్..

ఈసారి సీఎంతో చర్చలు సంతృప్తినిచ్చాయని.. ఈ నెలాఖరు లోపు అన్నింటికీ శుభం కార్డు పడుతుందని తెలిపారు. అటు సామాన్యులకు, ఇటు చిత్ర పరిశ్రమకు నష్టం కలగకుండా ప్రభుత్వం తన తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రోజూ అయిదు ఆటల ప్రదర్శనకు అనుమతి ఇవ్వడంతో పాటుగా.. పెద్ద చిన్న సినిమాలకు మేలు జరిగే జీవో ఈ నెలాఖరులోగా వస్తుందని పేర్కొన్నారు.

అయితే జగన్ తో సినీ ప్రముఖులు భేటీ అవడంపై మంచు విష్ణు స్పందించలేదు. ఇండస్ట్రీకి తీపి కబురు రాబోతోందని వార్తలు వచ్చినా సైలెంట్ గానే ఉన్నారు. కానీ రివర్స్ లో ట్వీట్ పెట్టడం.. మళ్ళీ డిలీట్ చేసి దాని వెనుక ఏదో ఉద్దేశ్యం ఉందనుకొని అందరూ మాట్లాడుకునేలా చేశారు. ఈ క్రమంలోనే నిజంగానే అందులో నిగూఢ అర్థం ఏదైనా ఉందా? ఈ టైంలో అది అసంబద్ధమైన ట్వీట్ అని తొలగించారా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ ట్వీట్ ఎందుకు పెట్టారు? ఎందుకు డిలీట్ చేశారు? అనేది మంచు విష్ణుకు మాత్రమే తెలుస్తుంది.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులుగా మంచు ఫ్యామిలీకి పేరుంది. వైఎస్ కుటుంబంతో దగ్గరి బంధుత్వం కూడా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో మోహన్ బాబు - మంచు విష్ణు.. వైసీపీ గెలుపు కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఎందుకనో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 'మా' అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా విష్ణు ఏపీ సీఎంని కలవలేదు. ఇప్పుడు లేటెస్టుగా జరిగిన సమావేశంలో మంచు హీరోలెవరు కనిపించకపోవడం గమనార్హం.