Begin typing your search above and press return to search.

'ఆడవాళ్లు..' కోసం దేవిశ్రీ స్వరపరిచిన అందమైన 'మాంగళ్యం' పాట..!

By:  Tupaki Desk   |   23 Feb 2022 6:41 AM GMT
ఆడవాళ్లు.. కోసం దేవిశ్రీ స్వరపరిచిన అందమైన మాంగళ్యం పాట..!
X
శర్వానంద్ - రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''ఆడవాళ్లు మీకు జోహార్లు''. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఖుష్బు - రాధిక శరత్‌ కుమార్ - ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. 2022 మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

ప్రమోషన్స్ లో భాగంగా 'ఆడవాళ్లు..' సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ - టీజర్‌‌ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలానే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపొజిషన్ నుంచి వచ్చిన మూడు పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా 'మాంగళ్యం' అనే మరో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. 'మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా.. మమ జీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా..' అంటూ సాగే ఈ గీతం శ్రోతలను అలరిస్తోంది.

పెళ్లి కాలేదని బాధపడే శర్వానంద్.. తన జీవితంలో అలాంటి ఘట్టం ఉంటుందా లేదా అనే సందేహంలో 'మాంగళ్యం' పాట పాడుకుంటున్నారు. దివ్యమైన పెళ్లి శ్లోకాన్ని తీసుకొని సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు స్వరాలు సమకూర్చడమే కాదు.. సాహిత్యం కూడా అందించారు. బాలీవుడ్ సింగర్ జస్ప్రీత్ జాస్ ఈ సాంగ్ ను ఆలపించారు.

'మూడు ముళ్ళు వేయకుండా నా గూడు కూల్చేశారు.. ఏడడుగులు నడవనివ్వకుండా ఏడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.. రింగ్ లో ఫింగర్ పెట్టనివ్వకుండా లైఫ్ లో ఫింగర్స్ పెట్టేస్తున్నారు.. అరుంధతి నక్షత్రం బదులు చుక్కలు చూపిస్తున్నారు' అంటూ క్యాచీ లిరిక్స్ రాసారు డీఎస్పీ. ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరించబడిన 'మాంగళ్యం' సాంగ్ విజువల్ గా కూడా బాగుంది.

ఇందులో శర్వానంద్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. రాజు సుందరం మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేసారు. దేనికి సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు చూసుకున్నారు. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించారు.

ఇప్పటికే 'ఆడవాళ్లు..' నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. దీనికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా వచ్చిన 'మాంగళ్యం తంతునానేనా' పాట కూడా సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. శర్వా చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.