Begin typing your search above and press return to search.

నానీని లైన్లో పెట్టే పనిలో మారుతి!

By:  Tupaki Desk   |   23 April 2021 2:30 PM GMT
నానీని లైన్లో పెట్టే పనిలో మారుతి!
X
యూత్ .. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మనసులు కూడా దోచేసిన దర్శకుడిగా మారుతి కనిపిస్తాడు. మారుతి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా 'భలే భలే మగాడివోయ్' .. 'మహానుభావుడు' కనిపిస్తాయి. హీరోకి గల బలహీనతను ఆధారంగా చేసుకుని ఆయన తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. 'భలే భలే మగాడివోయ్' సినిమా నాని కెరియర్లోనే ప్రత్యేకమైన కేటగిరిలో నిలిచింది. అందువల్లనే నానీతో మరో సినిమా చేయడానికి మారుతి ఉత్సాహం చూపుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం మారుతి .. గోపీచంద్ కథానాయకుడిగా 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందిస్తున్నాడు. తనదైన యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను అలరించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా ఆయన రాశి ఖన్నాను తీసుకున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టుగా నానీతో సినిమా ఉండొచ్చనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఆల్రెడీ నానీకి మారుతి ఒక కథను వినిపించడం జరిగిపోయిందని అంటున్నారు. నానీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావలసి ఉందని చెబుతున్నారు.

నాని చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఒక్కో జోనర్ నుంచి ఒక్కో కథను ఎంచుకుని ఈ సారి ఆయన రంగంలోకి దిగాడు. 'టక్ జగదీశ్' సినిమా ఈ నెల 23వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ కరోనా ఉధృతి కారణంగా వాయిదా పడింది. ఇక 'శ్యామ్ సింగ రాయ్' .. 'అంటే .. సుందరానికీ' సినిమాలు రెండూ కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలను నాని పూర్తి చేయవలసి ఉంది. ఆ తరువాత ఆయన మారుతి ప్రాజెక్టును చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అంటే ఒకవేళ ఈ ప్రాజెక్టు సెట్ అయినా, పట్టాలపైకి ఎక్కేది వచ్చే ఏడాదిలోనేనన్నమాట.