Begin typing your search above and press return to search.

అలీకి మెగాస్టార్ ప‌రామ‌ర్శ‌.. ప‌వ‌న్ ట్వీట్!

By:  Tupaki Desk   |   20 Dec 2019 6:56 AM GMT
అలీకి మెగాస్టార్ ప‌రామ‌ర్శ‌.. ప‌వ‌న్ ట్వీట్!
X
టాలీవుడ్ హాస్యనటుడు అలీ తల్లి జైతన్ బీబీ కాలం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ర‌ణం అలీ కుటుంబ స‌భ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. ఇప్ప‌టికే అలీ స‌న్నిహితులు.. ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. అలీ ఆ స‌మ‌యంలో దూర‌ప్రాంతంలో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త‌ల్లి మ‌ర‌ణ‌వార్త విన్న అనంత‌రం ఆయ‌న హైద‌రాబాద్ కు చేరుకున్నారు.

ఈ మ‌ర‌ణ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లోని అలీ ఇంటికి చేరుకుని పరామర్శించారు. జైతన్ బీబీ పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమండ్రిలో చనిపోవ‌డంతో మృతదేహాన్ని గురువారం ఉదయం హైదరాబాద్ కు తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే చిరంజీవి అలీ ఇంటికి బయలుదేరి వెళ్లారు. చాలాసేపు అక్కడే గడిపి అలీని ఓదార్చారు.

అలీకి అత్యంత స‌న్నిహితులైన ప‌లువురు సెల‌బ్రిటీలు ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ నివాసంలో ప‌రామ‌ర్శించారు. అలీ స్నేహితుడు.. జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సంద‌ర్భంగా అలీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఖాతాలో ప‌వ‌న్ స్పందించారు. ``అలీ తల్లి జైతున్ తుదిశ్వాస విడిచారని తెలిసి చాలా బాధపడ్డాను. జైతున్ బీబీ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. అలీకి తన తల్లితో ఉన్న అనుబంధం ఎంత బలమైనదో తెలుసు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను`` అని తెలిపారు.