Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ నినాదాలు ఆగిపోతాయా?

By:  Tupaki Desk   |   20 March 2016 3:00 PM IST
పవర్ స్టార్ నినాదాలు ఆగిపోతాయా?
X
గత కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను మళ్లీ ఒకే వేదికపై చూస్తామని ఎవ్వరూ అనుకోలేదు. దూరం అంతకంతకూ పెరుగుతూ పోయింది తప్పితే తగ్గలేదు. కానీ ఆర్నెల్లలో పరిణామాలన్నీ మారిపోయాయి. పవన్ వెళ్లి చిరును కలిశాడు. చిరు వచ్చి పవన్ ను మీటయ్యాడు. మొత్తానికి అన్నదమ్ములిద్దరూ దగ్గరైపోయారు. ఆదివారం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకకు చిరంజీవే ముఖ్య అతిథిగా రాబోతుండటంతో అన్నదమ్ముల రీయూనియన్ పూర్తయినట్లే అని చెప్పాలి.

మెగా అభిమానులందు పవర్ స్టార్ అభిమానులు వేరయా అన్నట్లు కొన్నేళ్లుగా పవన్ ఫ్యాన్స్ వేరు కుంపటి పెట్టేసుకున్నారు. మెగా హీరోల ఆడియో వేడుకలు జరిగితే.. అక్కడ పవన్ అభిమానుల గుంపు వేరుగా ఉంటుంది. పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించడం అన్నది మామూలైపోయింది. ఇది మెగా ఫ్యామిలీలోని హీరోలందరికీ పెద్ద తలనొప్పిగా మారిపోయింది. చివరికి నాగబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. చిరంజీవి కూడా చాలాసార్లు ఇబ్బంది పడి కొన్నిసార్లు చికాకు వ్యక్తం చేశాడు కూడా. ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియోకు చిరునే ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నేపథ్యంలో పవన్ అభిమానుల్లో.. చిర మీద, ఇక మిగతా మెగా హీరోలపై ఉన్న వ్యతిరేక భావం కొంత వరకు తగ్గే అవకాశముంది. అన్నదమ్ములిద్దరూ తిరిగి కలిసిపోయారు కాబట్టి.. ఇకపై మెగా హీరోల ఆడియో ఫంక్షన్లలో పవర్ స్టార్ నినాదాల హోరు కూడా తగ్గిపోయే ఛాన్సుంది.