Begin typing your search above and press return to search.

ల‌తాజీ దీదీ అంత్య‌క్రియ‌ల్లో మోదీ-స‌చిన్-షారూక్

By:  Tupaki Desk   |   6 Feb 2022 3:30 PM GMT
ల‌తాజీ దీదీ అంత్య‌క్రియ‌ల్లో మోదీ-స‌చిన్-షారూక్
X
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం శివాజీ పార్క్ మైదానంలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఈ అంత్యక్రియలకు ప్రధాని మోదీ- షారుక్ ఖాన్- స‌చిన్ టెండూల్క‌ర్ వంటి దిగ్గ‌జాలు అటెండ‌య్యారు. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే- ఆశా భోంస్లే స‌హా పలువురు ప్రముఖులు శివాజీ పార్క్ లో జరిగిన లతా మంగేష్కర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. శ్రద్ధా కపూర్- దేవేంద్ర ఫడ్నవీస్ పలువురు ప్రముఖులు సంగీత దిగ్గజం అంత్యక్రియలకు హాజరై మృతురాలి ఆత్మకు నివాళులర్పించారు.

సాయంత్రం 6 గంట‌ల నుంచే శివాజీ పార్క్‌లో అభిమానుల తాకిడి ప్రారంభ‌మైంది. `మేరీ ఆవాజ్ హాయ్` ప్లే చేస్తూ క‌డ‌సారి వీడ్కోలు ప‌లికారు. జాతీయ పతాకంతో కప్పబడిన గాన దిగ్గజం లతా మంగేష్కర్ భౌతికకాయాన్ని పూలతో అలంకరించిన ట్రక్కులో దక్షిణ ముంబైలోని ఆమె నివాసం నుండి శివాజీ పార్క్ కు తీసుకువెళ్లారు. అక్కడ ఆమె ``మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై`` పాటను ప్లే చేయడం ద్వారా అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.

లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శివాజీ పార్క్ కు చేరుకోగా అప్ప‌టికే అక్క‌డ ఉన్న షారూక్ చెంత‌నే కూర్చుని క‌నిపించారు. ఆదివారం ఉదయం స‌చిన్ జీ దిగ్గజ గాయకురాలితో ఉన్న ఓ ఫోటోని పంచుకున్నారు. “లతా దీదీ జీవితంలో ఒక భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె ఎల్లప్పుడూ తన ప్రేమ ఆశీర్వాదాలను నాకు అందించారు. ఆమె చనిపోవడంతో నాలో కొంత భాగం కూడా కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఆమె ఎప్పుడూ తన సంగీతం ద్వారా మన హృదయాల్లో జీవించడం కొనసాగిస్తుంది`` అని భావోద్వేగంతో నివాళులు అర్పించారు.

చెల్లెలు ఆశా భోంస్లే సహా లతా మంగేష్కర్ కుటుంబం మొత్తం శివాజీ పార్క్ లో జ‌రిగిన అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. ఇక్కడ ల‌తాజీ భౌతికకాయాన్ని ప్రజల దర్శనం కోసం ఉంచారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ అంత్య‌క్రియ‌ల‌కు హాజరయ్యారు.

శివాజీ పార్క్ లో షారూఖ్..

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ లతా మంగేష్కర్ ను చివరిసారి చూసేందుకు శివాజీ పార్క్ కు చేరుకున్నారు. డ్రగ్స్ ఇన్ క్రూయిజ్ కేసులో అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత షారూక్ ఇలా మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు. ఖాన్ ఎక్కువ స‌మ‌యం స‌చిన్ టెండూల్కర్ తో క‌లిసి ఆ ప‌రిస‌రాల్లో ఉన్నారు.