Begin typing your search above and press return to search.

'మన కథ ముగిసింది' అంటూ నీతూ కపూర్‌ భావోద్వేగం

By:  Tupaki Desk   |   2 May 2020 2:30 PM GMT
మన కథ ముగిసింది అంటూ నీతూ కపూర్‌ భావోద్వేగం
X
బాలీవుడ్‌ జంటల్లో అన్యోన్యమైన జంటగా పేరొందారు నీతూ - రిషి కపూర్‌. ఇద్దరు కలిసి 40 ఏళ్లు జీవనం సాగించారు. రియల్ లైఫ్‌ లోనే కాదు.. రీల్ లైఫ్‌ లో కూడా వీరిది సూపర్ హిట్ జోడీ. ఎన్నో సూపర్‌హిట్ బాలీవుడ్ చిత్రాల్లో ఈ జంట ప్రేక్షకులను అలరించింది. 'రఫూ చక్కర్‌' 'దో దూని చార్‌' 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' 'దూస్రా ఆద్మీ' 'అంజానే మే' 'ధన్‌ దౌలత్‌' 'ఖేల్‌ ఖేల్‌ మే' 'జిందా దిల్‌' 'జరీలా ఇన్సాన్‌' వంటి అనేక సినిమాల్లో జోడీగా నటించారు. 1980లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు రిషి కపూర్‌ - నీతూ జంట. కుటుంబం కోసం చాలా కాలం నటనకు దూరమైన నీతూ 'బేషరమ్‌' 'లవ్‌ ఆజ్‌ కల్‌' వంటి చిత్రాల్లో భర్తతో కలిసి తెరపై కనిపించారు. వీరికి రణబీర్ కపూర్ - రిథిమాకపూర్ సంతానం ఉన్నారు. ర‌ణ‌బీర్ క‌పూర్ ప్ర‌స్తుతం బాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు కాగా.. రిద్ధిమా డిజైన‌ర్‌గా స్థిర‌ప‌డింది.

రిషి కపూర్‌ గత కొన్నేళ్లుగా లుకేమియాతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో కాన్సర్‌ చికిత్స పొందిన రిషి కపూర్‌ కొన్ని రోజుల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఆయన శాశ్వత నిద్రలోకి జారుకోవడంతో నీతూ కపూర్ శోక సంద్రంలో మునిగిపోయారు. లుకేమియాతో బాధ‌ప‌డుతుండ‌గా రిషి కపూర్ ని కంటికి రెప్ప‌లా చూసుకుంది నీతూ. ఆసుప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో రిషిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ.. అతడి కోసం అమ్మలా మారానని.. మూడో బిడ్డ‌లా రిషీని చూసుకున్నానని ఆ మధ్యన ఓ ఇంటర్య్యూలో వెల్లడించారు నీతూ.

ఇప్పుడు రిషీ తోడు లేకుండా కాలం గడుపుతున్న నీతూ 40 ఏళ్లపాటు తనతో కలిసి జీవనం సాగించిన భర్తకు సోషల్ మీడియా ద్వారా వీడ్కోలు పలికారు. మందు గ్లాసు పట్టుకుని చిరునవ్వుతో ఉన్న భర్త ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి ‘మన కథ ముగిసింది’ అని కామెంట్ చేశారు. నీతూ కామెంట్ భావోద్వేగానికి గురి చేస్తోంది. ఇక ఆమె పోస్టు చూసిన నెటిజన్లు రిషీ కపూర్‌కు సోషల్‌ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.