Begin typing your search above and press return to search.

‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ కి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..!

By:  Tupaki Desk   |   2 April 2022 1:30 AM GMT
‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ కి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..!
X
సినీ అభిమానులకు ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా కమెడియన్ గా.. సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారాయన. హాస్యనటుడిగా ఓ వెలుగు వెలిగిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి గత ఎన్నికలలో వైఎస్సాఆర్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు.

అందుకు ప్రతిఫలంగా పృథ్వీరాజ్ కి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే మహిళా ఉద్యోగినితో పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడాడంటూ ఓ ఫోన్ కాల్ రికార్డిండ్ వైరల్ అవడంతో.. వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో స్వచ్చంధంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండటం.. మరోవైపు సినిమా అవకాశాలు రాకపోవడంతో రెంటికీ చెడ్డ రేవడిలా మారింది పృథ్వీరాజ్ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ వీడియోలో మాట్లాడుతూ.. రాజకీయాల కారణంగా తాను సినిమాల్లో అవకాశాలు తగ్గాయని.. ఒకప్పటిలా తనకు ఎవరు పిలిచి మరి ఆఫర్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తన వెనుకు పెద్ద కొండ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు చేశానని.. తన రేంజ్ ఏంటని ఆలోచించలేదని పృథ్వీరాజ్ తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందర్నీ కలిసి క్షమించమని కోరుతానని.. మార్పు చెందిన తనను ముందుకు నడిపించాలని కోరుతున్నానని వీడియోలో పేర్కొన్నారు. అయితే సినిమా ఆఫర్లు లేవని ఆవేదన వ్యక్తం చేసిన పృథ్వీరాజ్.. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్నారు.

నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #NBK107 సినిమాలో పృథ్వీరాజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్యతో పాటుగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అవకాశాలు లేవని బాధ పడుతున్న పృథ్వీరాజ్ కు ఇప్పుడు బాలయ్య ఛాన్స్ ఇచ్చి లిఫ్ట్ ఇస్తున్నాడు.

రాజకీయాల్లో ఉన్నప్పుడు పృథ్వీరాజ్ మెగా ఫ్యామిలీతో పాటు నందమూరి బాలకృష్ల పై విమర్శలు చేసారు. అయినా అవేమీ పట్టించుకోకుండా సీనియర్ నటుడికి బాలయ్య తన సినిమాలో నటించే అవకాశం అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో థర్డ్ ఇయర్స్ ఇండస్ట్రీకి మరిన్ని ఛాన్సెస్ వస్తాయేమో చూడాలి.

ఇకపోతే రాజకీయాలు తన లాంటి ముక్కుసూటి మనిషికి పడవనే విషయం అర్ధమైందని.. ఇకపై సినిమా రంగంలోనే కొనసాగుతానని పృథ్వీరాజ్ ఇటీవల పేర్కొన్నారు. జరిగిన పరిణామాలు గొప్ప గుణపాఠం నేర్పాయని.. రాజకీయాలు కారణంగా అందరూ బాగానే ఉన్నా తను మాత్రం రోడ్డున పడ్డానన్నారు.

రాజకీయాల్లో భాగంగా చిరంజీవిని తిట్టినా.. ఆయన దయతలిచి తాను హీరోగా నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో అవకాశం ఇచ్చారని తెలిపారు. తనకు కరోనా సోకినపుడు తాను బతుకుతానో లేదో అన్న టైమ్లో సినీ పరిశ్రమ తనకు ఎంతో చేయూత నిచ్చిందన్నారు. సాయి కుమార్ - జీవితా రాజశేఖర్ వంటి వారు తనకు అండగా నిలబడిన సంగతి గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో ఇండస్ట్రీ పెద్దల గురించి కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశానని.. దీంతో ఫుట్ బాల్ లా ఎక్కడో పోయిపడ్డానని అన్నారు. త్వరలో చిరంజీవితో పాటు అశ్వనీదత్ వంటి పెద్దలను కలిసి తన తప్పును క్షమించమని కోరుతానన్నారు. మార్పు కోసం తాను ఒక అడుగు వేస్తే.. మీరు వంద అడుగులు ముందుండి నడిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నంటు పృథ్వీరాజ్ వినయంగా అర్థించారు.