Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా మీరా చోప్రా ట్వీట్..!

By:  Tupaki Desk   |   9 April 2022 3:30 PM GMT
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా మీరా చోప్రా ట్వీట్..!
X
'బంగారం' తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మీరాచోప్రా.. చివరగా తెలుగులో 'గ్రీకు వీరుడు' చిత్రంలో కనిపించింది. అయితే కరోనా పాండమిక్ టైమ్ లో అనూహ్యరీతిలో తెరపైకి వచ్చింది. చిట్ చాట్ సెషన్ లో తెలుగు నుంచి ఇష్టమైన హీరోగా మహేష్ బాబు పేరు చెప్పిన మీరా.. అదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని.. తాను అతని ఫ్యాన్‌ ను కాదని పేర్కొంది.

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ఎవరో తెలీదని చెప్పడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ మీరా చోప్రా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ పెద్ద ఎత్తున చేశారు. తారక్ ఫ్యాన్స్ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించడం అప్పట్లో నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయింది.

దీనిపై మీరా చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయమహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ వివాదం పెద్ద దుమారాన్నే లేపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అంతా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా మీరా చోప్రా పరోక్షంగా మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతూ ఓ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల కాలంలో సౌత్ స్టార్స్ అంతా జాతీయ స్థాయిలో రాణిస్తున్న నేపథ్యంలో మీరా చోప్రా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ''దక్షిణ భారత నటీనటులు పాన్ ఇండియా గుర్తింపు పొందడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. వారి ప్రతిభ, వారి వినయం, వారి అభిరుచి నుండి ఎంతో నేర్చుకోవాలి. ప్రభాస్ - అల్లు అర్జున్ - రామ్ చరణ్ - యష్ లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది'' అని ట్వీట్ లో పేర్కొంది. అయితే ఈ లిస్టులో ఎన్టీఆర్ పేరు లేకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారితే.. 'పుష్ప' చిత్రంతో బన్నీ నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నారు. 'కేజీఎఫ్' తో యష్ స్టార్ డమ్ నార్త్ వరకూ పాకింది. ఇప్పుడు లేటెస్టుగా RRR మూవీతో ఎన్టీఆర్ - రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు. అయితే వీళ్ళలో అందరి పేర్లు ప్రస్తావించిన మీరా.. తారక్ ను విస్మరించింది.

ఈ నేపథ్యంలో బంగారం హీరోయిన్ పై ఎన్టీఆర్ అభిమానులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో పెర్ఫార్మన్స్ గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుతోందని.. ఇలాంటి ట్వీట్స్ ఆయన క్రేజ్ ని తగ్గించలేవని కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు.

నిజానికి మీరా చోప్రా రెండు రోజుల క్రితమే 'రామ్ చరణ్' ని ప్రస్తావిస్తూ.. లవ్ సింబల్స్ ఎమోజీలు జోడించి ఓ ట్వీట్ పెట్టింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా మరో ట్వీట్ పెట్టింది. అంతేకాదు RRR లో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే 'టెర్రిఫిక్' అని పేర్కొంది. ఎన్టీఆర్ గురించి మాత్రం స్పందించలేదు.

అయితే మీరా చోప్రా ట్వీట్ కారణంగా నందమూరి - మెగా అభిమానుల మధ్య కూడా రచ్చ జరుగుతోంది. చెర్రీ ఫ్యాన్స్ మీరా చోప్రాకి మద్దతుగా నిలుస్తుండటంతో తారక్ ఫ్యాన్స్ వాళ్ళకి కౌంటర్స్ ఇస్తున్నారు. RRR సినిమాలో ఇద్దరు హీరోల ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ.. ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఏదైతేనేం మీరా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మరోసారి ట్విట్టర్ లో కొట్టుకునే పరిస్థితి వచ్చింది.