Begin typing your search above and press return to search.

మహేష్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన జక్కన్న..!

By:  Tupaki Desk   |   1 April 2022 6:01 PM GMT
మహేష్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన జక్కన్న..!
X
దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు సక్సెస్ జోష్ లో ఉన్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో మాస్టర్ స్టోరీ టెల్లర్ తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా 'RRR' బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఏస్ఏ మరియు నార్త్ లో భారీ వసూళ్లను రాబడుతోంది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న జక్కన్న.. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో తదుపరి మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని అగ్ర దర్శకుడు ఇది వరకే క్లారిటీ ఇచ్చారు.

మహేష్ - రాజమౌళి వంటి క్రేజీ కాంబోలో సినిమా రాబోతోందని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. SSMB29 కథేంటి? జోనర్ ఏమయ్యుంటుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంటూ నిత్యం చర్చిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ బాబుతో చేయబోయే సినిమా గురించి క్రేజీ అప్డేట్ అందించారు రాజమౌళి. RRR సినిమా ఘనవిజయం సాధించిన సందర్భంగా దర్శకుడు ఓ నేషనల్ వెబ్ పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

మహేష్ బాబు సినిమా కోసం ఆసక్తికరమైన రెండు స్టోరీ లైన్స్ రెడీగా ఉన్నట్లు జక్కన్న తెలిపారు. "పాండమిక్ కారణంగా చాలా విషయాలు వాయిదా పడ్డాయి. స్టోరీలపై పని చేయడం తప్ప నాకు వేరేదేమీ లేదు. అదృష్టవశాత్తూ ఒకట్రెండు లైన్లు ఆసక్తికరంగా అనిపించాయి’’ అని రాజమౌళి చెప్పారు.

"సాధారణంగా నేను ఒక స్టోరీ లైన్ రెడీ చేయడానికి.. ప్రీ-విజువలైజేషన్ మరియు ప్రీ-ప్రొడక్షన్ లో కొంత భాగాన్ని షూట్ కోసం సిద్ధం చేయడానికి దాదాపు ఆరు నుండి ఏడు నెలల సమయం తీసుకుంటాను. ఈ ఏడాది చివరి నాటికి తదుపరి సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాను." అని జక్కన్న చెప్పుకొచ్చారు.

ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే వరకు మరో మూవీపై దృష్టి పెట్టని రాజమౌళి.. RRR సినిమా విడుదలై హిట్ అవడంతో ఇప్పుడు మహేష్ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. కొన్ని రోజులు విరామం తీసుకొని రంగంలోకి దిగనున్నారు. మహేష్ సినిమా 'బాహుబలి' & 'ఆర్.ఆర్.ఆర్' కంటే పెద్దదిగా ఉంటుందని ఇటీవల జక్కన్న పేర్కొన్నారు.

రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే మహేష్ కోసం స్టోరీ లైన్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ స్టోరీని అనుకున్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రచయిత వెల్లడించారు. దీంతోపాటు మరో డిఫరెంట్ లైన్ కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎల్‌.నారాయ‌ణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. మహేష్ బాబు - రాజమౌళిలతో సినిమా చేయాలని కెఎల్ నారాయణ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చుతున్నందుకు నిర్మాతతో పాటుగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.