Begin typing your search above and press return to search.

డైరెక్టర్స్ ఆన్ డిమాండ్.. తగ్గేదేలే..!

By:  Tupaki Desk   |   7 May 2022 10:30 AM GMT
డైరెక్టర్స్ ఆన్ డిమాండ్.. తగ్గేదేలే..!
X
సినీ ఇండస్ట్రీలో ఎవరి జాతకమైనా ఒక్క శుక్రవారంతో మారిపోతుందని అంటుంటారు. ఒక్క సినిమాతో ఉన్నట్టుండి క్రేజ్ వచ్చి పడుతుంది.. ఒక్క ఫలితం ఎన్నో అవకాశాలను దూరం చేస్తుంది. ఎవరి కెరీర్ ను ఆకాశం వైపు తీసుకెళ్తుందో.. ఎవరు పాతాళానికి పడిపోతారో ఊహించలేం. అందుకే అందరూ క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకుందాం అనే ఆలోచనతో ఉంటారు. ఒక సినిమా హిట్టయితే.. వెంటనే తదుపరి చిత్రానికి పారితోషికం పెంచేస్తుంటారు.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలతో ఇమేజ్ పెంచుకోవడమే కాదు.. దానికి తగ్గట్టుగా పారితోషికం అందుకుంటున్నారు. అయితే ఆ హీరోలకు అంతటి స్టార్ డమ్ - ఇమేజ్ రావడానికి.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తెచ్చి పెట్టడానికి ప్రధాన కారణమైన దర్శకులు సైతం ఈ మధ్య కాలంలో భారీగా తమ రెమ్యునరేషన్లను పెంచేస్తున్నారు.

డైరెక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. 24 క్రాఫ్ట్స్ పై పట్టు కలిగివుండి.. అందరినీ సమన్వయం చేసుకుంటూ ఓ సినిమాని రెడీ చేసేవాడు దర్శకుడు. ఇటీవల కాలంలో దర్శకుడి ప్రాముఖ్యత బాగా పెరిగింది. ఒకప్పుడు హీరోలను చూసి థియేటర్లకు వెళ్లే జనాలు.. ఇప్పుడు డైరెక్టర్ పేరు చూసి వెళ్లే రోజులు వచ్చాయి. అందుకే ప్రస్తుతం కొందరు దర్శకులకు హీరోల కంటే ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.

అందుకే నిర్మాతలు సైతం హీరోలతో పాటుగా దర్శకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. హిట్టు పడగానే అడ్వాన్స్ చేతిలో పెట్టి.. అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా రెమ్యునరేషన్స్ విషయంలో హీరోలకు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతీ ఒక్కరూ సక్సెస్ వచ్చిన వెంటనే రూటు మార్చి రేటు పెంచేస్తున్నారు.. లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నారు.

దక్షిణాది దర్శకులు గత కొన్నేళ్లుగా సినిమా మేకింగ్ విషయంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఆడియన్స్ పల్స్ పట్టుకొని వారికి కావాల్సిన కంటెంట్ ని అందిస్తున్నారు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కనివినీ ఎరుగని రికార్డులకు క్రియేట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు కాబట్టి.. దానికి తగ్గట్టుగానే కోటాను కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకులలో దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారు. వెండి తెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న.. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా నిలిచారు. సినిమా మేకింగ్ కు ఎక్కువ సమయం కేటాయించే రాజమౌళి.. ఆ సినిమా కోసం ఎంత తీవ్రంగా కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కష్టానికి తగిన ఫలితం అందుకుంటుంటారు.

అందులోనూ జక్కన్నతో పాటుగా ఆయన కుటుంబం మొత్తం తన సినిమాలో భాగం అవుతుంటారు. అందుకే దర్శకుడు ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకుంటారని అంటుంటారు. 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన RRR సినిమాకుగానూ, రాజమౌళి బృందానికి దాదాపు 100 కోట్ల వరకూ పారితోషికం అందించిందనేది ప్రచారంలో ఉంది. ఇండియాలో ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ మరొకరు లేరు. అంతేకాదు ఈ సినిమా లాభాల్లోనూ స్టార్ డైరెక్టర్ కు వాటా ఉన్నట్లు టాక్. తదుపరి మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు కూడా జక్కన్న ఇదే విధంగా తీసుకునే అవకాశం ఉంది.

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'కేజీయఫ్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు. ఇప్పుడు ఈ ప్రాంచైజీలో వచ్చిన 'కేజీయఫ్: చాప్టర్ 2' మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 1000 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం.. ఒక్క హిందీలోనే 400 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. అయితే ఈ సినిమాకు దర్శకుడు దాదాపు 25 కోట్లు అందుకున్నాడని టాక్ నడుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న 'సలార్' చిత్రానికి రెమ్యునరేషన్ తో పాటుగా లాభాల్లో వాటాను కూడా షేర్ చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారట.

ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ చేయబోయే తదుపరి రెండు సినిమాలకు రెట్టింపు పారితోషికం తీసుకోబోతున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు దర్శకుడు 50 కోట్ల అగ్రిమెంట్ చేసుకున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. RRR నిర్మాత డీవీవీ దానయ్య కూడా ప్రశాంత్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు కూడా డైరెక్టర్ కు యాభై కోట్లు ఇవ్వనున్నారని అనుకుంటున్నారు.

అల్లు అర్జున్ తో 'పుష్ప' సినిమా చేసిన బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్.. 20 - 25 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ ఉంది. ఇప్పుడు 'పుష్ప: పార్ట్-2' విషయంలో ఏమాత్రం తగ్గడం లేదని.. అంతకు రెట్టింపు తీసుకోనున్నారని అనుకుంటున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు మించి వసూలు చేయడంతో దర్శకుడు అడిగినంత ఇవ్వడానికి మైత్రీ టీం రెడీ అయిందని చెప్తున్నారు. భారీ బడ్జెట్ తో హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో సినిమాలు తెరకెక్కించే షో మ్యాన్ శంకర్.. RC15 కోసం దాదాపు 40 కోట్లు తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ - కొరటాల శివ - అనిల్ రావిపూడి - బోయపాటి శ్రీను - పూరీ జగన్నాథ్ - వంశీ పైడిపల్లి వంటి పలువురు దర్శకుల రెమ్యూనరేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. హరీష్ శంకర్ - శేఖర్ కమ్ముల - పరశురామ్ పెట్లా - సురేందర్ రెడ్డి వంటి దర్శకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. సక్సెస్ రేటు - డిమాండ్ ని బట్టి రేటు పెంచుతూ వెళ్తున్నారు. వీరిలో కొందరు సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉంటూ.. లాభాల్లో వాటాలు షేర్ చేసుకుంటున్నారు.