Begin typing your search above and press return to search.

సీక్వెల్ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యువ హీరో..!

By:  Tupaki Desk   |   9 July 2022 5:11 AM GMT
సీక్వెల్ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యువ హీరో..!
X
'అర్జున్ సురవరం' చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్.. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అయ్యాడు. అందులో ముందుగా సూపర్ నేచురల్ మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ''కార్తికేయ 2''చిత్రంతో రాబోతున్నాడు.

నిఖిల్ సిద్దార్థ్ - అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ''కార్తికేయ 2''. దర్శక హీరోల కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన 'కార్తికేయ' చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

హీరో నిఖిల్ 'కార్తికేయ - 2' చిత్రాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడని తెలుస్తోంది. ఇందులో భాగంగా సినిమాను దూకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు. కేవలం ఒక పాట లాంచ్ కోసం అతను ఆంధ్రప్రదేశ్ లోని పలు కాలేజీలకు వెళ్లి సందడి చేస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన 'కార్తికేయ 2' మూవీ ట్రైలర్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. యాక్షన్ సీక్వెన్స్ - విజువల్స్ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇలా అన్నీ కూడా బాగా కుదిరాయి. ఈ నేపథ్యంలో ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

'కార్తికేయ 2' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిఖిల్ అండ్ టీమ్ కలసి వైజాగ్ - రాజమండ్రి - ఏలూరు - భీమవరం నగరాలు చుట్టివస్తున్నారు. ఈ ఈవెంట్స్ లో 'నన్ను నేను అడిగా' అనే వీడియో సాంగ్ ని ప్రదర్శిస్తున్నారు.

సోషల్ మీడియాలో విడుదల చేయకుండా.. ముందుగా కాలేజీ విద్యార్థులకు ఈ పాటని చూపించడం గమనార్హం. జులై 11వ తేదీన ఈ పాటను అన్ని ఫ్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంచనున్నారు.

ఏదేమైనా 'కార్తికేయ 2' సినిమా కోసం మూడేళ్లు కష్టపడిన నిఖిల్.. జనాల్లోకి తీసుకెళ్లడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడని అర్థం అవుతోంది. ఈ చిత్రాన్ని హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తుండటం విశేషం

'కార్తికేయ' సినిమాకు మించి అత్యధిక బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సీక్వెల్ ని రెడీ చేశారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి - ప్రవీణ్ - ఆదిత్యా మీనన్ - తులసి - సత్య - వైవా హర్ష - వెంకట్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభోట్ల‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాలభైరవ సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ వస్తున్న నిఖిల్.. దాదాపు 8 ఏళ్ల తర్వాత చందు మొండేటి తో కలిసి ''కార్తికేయ 2'' తో వస్తున్నాడు. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకు ప్రకటించారు. అయితే ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేయనున్నారని టాక్ నడుస్తోంది. మేకర్స్ దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.