Begin typing your search above and press return to search.

స్టార్‌ డైరెక్టర్‌కు షాక్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   13 Oct 2020 5:45 AM GMT
స్టార్‌ డైరెక్టర్‌కు షాక్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు
X
సౌత్‌ ఇండియా స్టామినాను ఉత్తరాదికి తెలియజేసిన మొదటి సినిమా 'రోబో' అనడంలో సందేహం లేదు. వందల కోట్ల సినిమాలను సౌత్‌ ఇండస్ట్రీ కూడా అందించగలదు అంటూ 2010 సంవత్సరంలో రోబో సినిమా నిరూపించింది. శంకర్‌ దర్శకత్వంలో రజినీకాంత్‌ హీరోగా ఐశ్వర్యరాయ్‌ హీరోయిన్‌ గా నటించిన ఆ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమా విడుదల అయినప్పటిన ఉండి కూడా కథ విషయంలో వివాదం నెలకొంది. ఆరూర్‌ తమిళనాధన్‌ అనే రచయిత రోబో కథ తనది అంటూ మీడియా ముందుకు వచ్చాడు.

రోబో నిర్మాతలకు మరియు దర్శకుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారు పట్టించుకోక పోవడంతో కోర్టుకు వెళ్లారు. మద్రాస్‌ హైకోర్టులో ఈ కేసు కొనసాగుతుంది. కథ తనదే అంటూ శంకర్‌ అప్పటి నుండి కూడా బలంగా వాదిస్తూ వస్తున్నారు. దాంతో కేసు సాగతీత కొనసాగుతూనే ఉంది. తనపై ఉన్న కాపీరైట్‌ కేసును కొట్టి వేయాలంటూ ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టుకు శంకర్‌ వెళ్లాడు. అయితే ఆ కేసును కొట్టి వేయడం కుదరదు అంటూ సుప్రీం కోర్టు శంకర్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది.

మద్రాస్‌ హైకోర్టులోనే ఆ కేసుకు సంబంధించిన వాదోపవాదనలు మళ్లీ మొదలు కాబోతున్నాయి. రచయిత అరూర్‌ తమిళనాధన్‌ నష్టపరిహారంగా కోటి రూపాయలను ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడు. శంకర్‌ ఆ మొత్తం ఇస్తే కథ తనది కాదని ఒప్పుకున్నట్లుగా అవుతుంది. అందుకే ఆయన నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.