Begin typing your search above and press return to search.

RRR పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టిన పెన్ స్టూడియోస్..!

By:  Tupaki Desk   |   8 Sep 2021 9:30 AM GMT
RRR పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టిన పెన్ స్టూడియోస్..!
X
ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ వారు దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. జయంతిలాల్ గడ సారధ్యంలోని ఈ సంస్థ 'RRR' నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా అన్ని భాషల ఎలక్ట్రానిక్ - డిజిటల్ - శాటిలైట్ హక్కులు దక్కించుకుంది. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' తో పాటు, 'గంగూబాయి కతియావాడి' 'ఎటాక్' వంటి కొన్ని భారీ ప్రాజెక్టులు పెన్ స్టూడియోస్ వద్ద ఉన్నాయి. అయితే ఇండియాలో ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి ఆశాజనకంగా లేనందున వీటిలో కొన్ని సినిమాలు డైరెక్ట్ ఓటీటీ ప్లాట్‌ ఫారమ్‌ లలో విడుదలయ్యే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పెన్ స్టూడియోస్ సంస్థ ఈరోజు ఓ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని కొట్టిపారేసింది. "గంగుబాయి కథియావాడి - RRR & ఎటాక్ చిత్రాలు థియేటర్లలోనే విడుదల అవుతాయనే విషయాన్ని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. ఈ సినిమాలు థియేటర్లలో కంటే ముందు OTT ప్లాట్‌ఫామ్‌ లలో విడుదల అవుతాయని అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవి అవాస్తవమైనవి. ఈ అద్భుతమైన చిత్రాలు పెద్ద స్క్రీన్ అనుభవం కోసం రూపొందించబడ్డాయి. కచ్చితంగా థియేటర్లలో విడుదల చేయబడతాయి" అని చైర్మన్ జయంతిలాల్ గడా ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ - శ్రియా - సముద్రఖని వంటి పాపులర్ స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ''గంగూబాయి కతియావాడి''. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పోస్ట్ పోన్ చేశారు. ఇకపోతే జాన్ అబ్రహాం - రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఎటాక్'. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పెన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాలన్నీ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.