Begin typing your search above and press return to search.

పాటల జానకి.. అదే చివరి పాట అనేశారు

By:  Tupaki Desk   |   22 Sep 2016 6:59 AM GMT
పాటల జానకి.. అదే చివరి పాట అనేశారు
X
ది నైటింగేల్ ఆఫ్ సౌత్ అని దక్షిణాది మొత్తం పిలుచుకునే గాయని ఎస్ జానకి. ఇప్పుడీమె సింగర్ గా తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నట్లు చెప్పేశారు. 1957లో తమిళ్ మూవీ విదియిన్ విలయాట్టుతో సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. తన సుమధురమైన గాత్రంతో అలరిస్తూ వస్తున్నారు. దాదాపు 60 ఏళ్లపాటు గాయనిగా కొనసాగడం ఈమె సృష్టించిన అరుదైన రికార్డుల్లో ఒకటి.

ఇప్పుడీమె ఓ మలయాళ పాటతో తన కెరీర్ కు ముగింపు పలికేయాలని నిర్ణయించారు. అనూప్ మీనన్- మీరా జాస్మిన్ లు నటిస్తున్న '10 కాల్పనికాల్' చిత్రంలో ' అమ్మ పూవిను' అనే ట్రాక్ తో ఓ చరిత్రకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు జానకి. 'ఇదే నా చివరి పాట. ఇకపై నేను ఏ రికార్డింగులలోనూ పాల్గొనను.. అలాగే ఎక్కడా స్టేజ్ లపై పాడబోను' అని జానకి తేల్చేయడంతో.. సౌత్ సినీ ఇండస్ట్రీ అంతా షాక్ తినేసింది.

'ఇప్పుడు నాకు 78 ఏళ్లు. అనేక భాషల్లో ఎన్నో పాటలు పాడాను.. ఇకపై విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను' అని జానకి చెబుతున్నారు. మొత్తం 48వేల పాటలు పాడిన ఈమె.. 4 జాతీయ.. 32 రాష్ట్ర అవార్డులను అందుకున్నారు. ఇక ఈ మలయాళ పాటనే చివరిదిగా ఎంచుకోవడానికి కారణం.. ఆ పాట చరిత్రలో నిలిచిపోయేంత గొప్పగా ఉండడమే అని చెప్పారు జానకి.