Begin typing your search above and press return to search.

సెన్సేషనల్ ట్వీట్స్ తో మరోసారి బాంబ్ పేల్చిన పూనమ్..!

By:  Tupaki Desk   |   24 Feb 2022 10:00 AM GMT
సెన్సేషనల్ ట్వీట్స్ తో మరోసారి బాంబ్ పేల్చిన పూనమ్..!
X
సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయిన హీరోయిన్ పూనమ్ కౌర్. తరచుగా వైరాగ్యంతో కూడిన ట్వీట్లు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షించే ఈ పంజాబీ బ్యూటీ.. ఆ ట్వీట్లు ఎవర్ని ఉద్దేశించి చేస్తుందనేది పరోక్షంగా చెబుతూ ఉంటుంది. గత కొంతకాలంగా ఇండస్ట్రీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న పూనమ్.. ఆ మధ్య ఓ సీనియర్ నటుడి ప్రెస్ మీట్ వల్ల వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో ఇప్పుడు సరిగ్గా 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ కు ముందు బయటకు వచ్చింది. ఎప్పటిలాగే పేర్లు ప్రస్తావించకుండా.. అందరికీ అర్థమయ్యేలాగా ట్వీట్స్ చేసి సంచలనం రేపింది.

''రాజకీయాలు వినోదంగా మారిపోయాయి.. వినోదం అనేది రాజకీయంగా మారిపోయింది'' అని ట్వీట్ చేసిన పూనమ్ కౌర్.. ఆ తర్వాత ఓ సెన్సేషనల్ ట్వీట్ వేసి డిలీట్ చేసింది. ''నేను మనస్ఫూర్తిగా ఆదరించి, ప్రేమించిన వ్యక్తులు.. ఈ రాజకీయ నాయకుల దగ్గర వాళ్లకు వాళ్ళు తక్కువ చేసుకుని, చేతులు జోడించి, చేతులు కట్టుకుంటూ ఉండడం నాకు చాలా బాధ వేస్తోంది.. అవసరాలు కోసం కష్టపడి వచ్చిన వ్యక్తిత్వం చంపేసుకోవడం మానేయాలి'' అని ట్వీట్ చేసింది. దీనికి హార్ట్ బ్రేకింగ్ సింబల్స్ ను జత చేసింది.

అయితే కొద్దిసేపటికే పూనమ్ కౌర్ ఆ ట్వీట్ ని డిలీట్ చేసింది. కానీ అప్పటికే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్న నెటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసేసారు. ఎంధుకు డిలీట్ చేసావంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ను మెచ్చుకుంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆ వీడియో లింక్ ను ట్విట్టర్ లో షేర్ చేసారు. అయితే దీనికి స్పందించిన పూనమ్ మరో బాంబ్ వదిలింది.

''ఒక దర్శకుడు తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తాడు. అతని వ్యక్తిగత విషయాలపై పబ్లిక్ దారుణంగా మాట్లాడుతున్నా నిశబ్దంగా మూలన కూర్చొని చిరునవ్వులు చిందిస్తాడు. మరో దర్శకుడు రాజకీయంగా అతన్ని దిగజార్చ డానికి ఏదోకటి చేసి ట్విట్టర్‌ లో నవ్వుకుంటాడు. ఇద్దరూ కూడా మహిళలను ఆయుధంగా ఉపయోగించుకుని డబ్బుకు అద్దెకు తీసుకోబడిన ఏజెంట్స్'' అని పూనమ్ కౌర్ ట్వీట్ లో పేర్కొంది.

''ఎస్సీ ఎస్టీ కాండిడేట్ ను పొలిటికల్ ఎజెండా కోసం వాడుకోవడం, వారి రాజకీయ లబ్ది కొనసాగడానికి ఒక మహిళకు నరకం చూపించేలా అసభ్యంగా తిడుతూ నగ్నంగా నిలబెట్టడం.. ఓ అమ్మాయి వ్యక్తిగత జీవితం, ఆరోగ్యాన్ని నాశనం చేసి, డబ్బులను ఆఫర్ చేయడం, పోలీసులతో కంట్రోల్ చేసి భయపెట్టడం.. కాల్స్ టాప్ చేయడం'' అంటూ మరో ట్వీట్ చేసింది పూనమ్.

''ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలలో జరిగిన బిగ్గెస్ట్ క్రైమ్ ఏమిటి? మనం నిజంగా దృష్టి కేంద్రీకరించింది ఏమిటి? పెళ్లిళ్ల పైనా?'' అంటూ ఓ ట్వీట్ తో ప్రశ్నిస్తూ.. ''నిజమేమిటో బయటకు రావాలి.. సత్యమేవ జయతే'' అంటూ మరో ట్వీట్ లో పేర్కొంది. బుధవారం రాత్రి 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం.. గురువారం ఉదయాన్నే పూనమ్ కౌర్ ట్వీట్ల ప్రవాహం కురిపించడం చర్చనీయాంశంగా మారింది.

ఇందులో పూనమ్ కౌర్ ఏ ఒక్కరి పేరును ప్రస్తావించలేదు కానీ.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కు స్పందించడం వల్ల ఆ ట్వీట్స్ ఎవరెవరికి సంబంధించినవో అందరికీ అర్ధమయ్యేలా చేసింది. ప్రస్తుతం పూనమ్ చేసిన ట్వీట్స్ - ట్వీట్ చేసి డిలీట్ చేసిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ బ్యూటీ దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడుతుందా.. రాబోయే రోజుల్లో ఇలానే కొనసాగిస్తుందా అనేది చూడాలి.