Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్' కు దక్కనిది 'హను-మాన్' కు దక్కింది..!

By:  Tupaki Desk   |   30 Nov 2022 6:30 AM GMT
ఆదిపురుష్ కు దక్కనిది హను-మాన్ కు దక్కింది..!
X
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "హను-మాన్". తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇది హనుమంతుడి పాత్ర ఆధారంగా రూపొందించబడిన ఫిక్షనల్ సూపర్ హీరో మూవీ.

ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఇందులోని నాణ్యమైన వీఎఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ అందరినీ అబ్బురపరిచాయి.

సినీ అభిమానులే కాకుండా పలువురు ప్రముఖులు సైతం "హను-మాన్" సినిమా టీజర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. అలానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా టీమ్ ని ప్రశంసించారు.

బీజేపీ నేత కిషన్ రెడ్డి రీసెంట్ గా 'హను మాన్' టీజర్ చూసి, చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా కలిసి అభినందించారు. టీజర్ చాలా బావుందని.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.

ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్టమైన కంటెంట్ తో తెరకెక్కే చిత్రాలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. 'కార్తికేయ 2' చిత్రానికి అధికార బీజేపీ పార్టీకి చెందిన నాయకులు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడానికి ఎంతో కొంత సహాయపడిందనేది వాస్తవం.

భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిన 'ఆది పురుష్' సినిమాకి కూడా బీజేపీ మద్దతు లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ టీజర్ పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అలానే సినిమాలో ప్రధాన పాత్రల చిత్రణపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

పలువురు బీజేపీ నేతలు 'ఆది పురుష్' సినిమాని విమర్శించడమే కాదు.. బ్యాన్ చేయాలంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని మరో ఐదు నెలలు వాయిదా వేసి, మెరుగైన అవుట్ పుట్ అందించడానికి రీ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే టీజర్ రిలీజ్ తర్వాత 'ఆది పురుష్' చిత్రానికి దక్కని ప్రశంశలు.. ఇప్పుడు "హను మాన్" టీజర్ కు దక్కుతున్నాయి. లార్డ్ హనుమంతుడి ప్రేరణగా రూపొందించిన ఈ సినిమాకి బీజేపీ మద్దతు లభిస్తే.. పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించడానికి కచ్ఛితంగా ఉపయోగపడుతుంది.

ఇక "హను మాన్" లోని కంటెంట్ ప్రేక్షకులకు నచ్చితే, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సంచలన విజయం నమోదు చేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

కాగా, "హను మాన్" చిత్రంలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ - వినయ్ రాయ్ మరియు రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.