Begin typing your search above and press return to search.

మిస్ ఫైర్: మ‌ల్లేశం.. బైక్ కొట్టేశారా?

By:  Tupaki Desk   |   9 July 2019 5:32 AM GMT
మిస్ ఫైర్: మ‌ల్లేశం.. బైక్ కొట్టేశారా?
X
సోష‌ల్ మీడియాలో డ్రామా ఆడ‌టం ద్వారా సినిమాను ప్ర‌మోట్ చేసుకోవాల‌నుకున్న చెత్త ఐడియా అడ్డం తిర‌గ‌ట‌మే కాదు.. ఇప్పుడు లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చే ప‌రిస్థితి నెల‌కొంది. క‌మెడియ‌న్ గా తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మే అయినా.. పేరు పెద్ద‌గా రిజిస్ట‌ర్ కాని న‌టుడు ప్రియ‌ద‌ర్శి. ఇటీవ‌ల అత‌గాడు న‌టించిన మ‌ల్లేశం మూవీతో ఒక్క‌సారిగా ఆయ‌న పేరు అంద‌రి నోట్లో నానుతున్న ప‌రిస్థితి.

చింత‌కింది మ‌ల్లేశం బ‌యోపిక్ తో హీరోగా మారిన ప్రియ‌ద‌ర్శి తాజాగా చేసిన ట్వీట్ అత‌నికి కొత్త స‌మస్య‌ల్ని తెచ్చి పెట్ట‌ట‌మే కాదు.. మీడియా.. పోలీసుల ఆగ్ర‌హాన్ని చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఫ‌న్నీ కోస‌మో.. ప్ర‌మోష‌న్ కోస‌మో కొన్ని సీరియ‌స్ అంశాల్ని ట‌చ్ చేయ‌టం ఏ మాత్రం మంచిది కాదు. ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయిన ప్రియ‌ద‌ర్శి చేయ‌కూడ‌ని త‌ప్పు చేశారు.

త‌న స్నేహితుడైన సినీ హీరో సందీప్ కిష‌న్ తాజాగా న‌టించిన చిత్రం నిను వీడ‌ని నీడ‌ను నేనే. ఆ సినిమా ప్ర‌మోష‌న్ ను కాస్తంత వెరైటీగా చేస్తున్నారు. ఇందులో భాగంగా త‌న స్నేహితుడికి సాయం చేయాల‌న్న ఉద్దేశంతో తాజా హాట్ టాపిక్ గా మారిన ప్రియ‌ద‌ర్శి ఒక ట్వీట్ చేశారు. అందులో త‌న బైక్ పోయింద‌ని పేర్కొన్నారు. ఎవ‌రో అన్ ప్రొఫెష‌న‌ల్ దొంగ త‌న బైక్ కొట్టేశాడంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. దొంగ‌త‌నం అనే సీరియ‌స్ అంశం చోటుచేసుకోవ‌టం.. అది కూడా ఇటీవ‌ల పేరు వ‌చ్చిన న‌టుడిది అవ్వ‌టంతో పాటు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌టంతో అటు పోలీసులు.. ఇటు మీడియా అలెర్ట్ అయ్యింది.

హైద‌రాబాద్ సిటీ పోలీసులు అయితే.. దొంగ‌త‌నం జ‌రిగిన ప్రాంతం వివ‌రాలు చెప్పాల్సిందిగా కోరారు. దీంతో.. ప‌రిస్థితి అర్థ‌మైన ప్రియ‌ద‌ర్శి త‌న ట్వీట్ ను తొల‌గించారు. ప్ర‌మోష‌న్ కోసం చేసిన ప‌ని మిస్ ఫైర్ కావ‌ట‌మే కాదు.. ప‌లువురు తిట్ల దండ‌కాన్ని లంకించుకున్న ప‌రిస్థితి. ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న వ‌రుస నేరాల‌తో త‌ల‌బొప్పి క‌ట్టిన హైదరాబాద్ పోలీసులు ప్రియ‌ద‌ర్శి చేసిన ప‌నిపై కారాలు మిరియాలు నూరుతున్న‌ట్లు చెబుతున్నారు. ఎంత సినిమా ప్ర‌మోష‌న్ అయితే మాత్రం ఇంత బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అని త‌ప్పు ప‌డుతున్నారు.

ఇక‌.. మీడియా సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఒక సినీ న‌టుడి బైక్ దొంగ‌త‌నం జరిగిన విష‌యాన్ని నిజ‌మేన‌ని భావించి వార్త‌లు ఇచ్చేయ‌టం.. మ‌రికొంద‌రుచెక్ చేసుకునే క్ర‌మంలో అస‌లు విష‌యం తెలిసి ఆగిపోయిన ప‌రిస్థితి. ఇది తెలీని సీనియ‌ర్లు.. వార్త‌ను ఎందుకు ఫైల్ చేయ‌లేదంటూ క్రైమ్ రిపోర్ట‌ర్ల‌కు త‌లంటు పోయ‌టం.. వారు అస‌లు విష‌యాన్ని చెప్ప‌టం లాంటి గంద‌ర‌గోళాలు చాలానే చోటు చేసుకున్నాయి. దీంతో.. త‌న ప్ర‌చారం కోసం ఇంత మందిని ఇబ్బంది పెట్టిన ప్రియ‌ద‌ర్శిపై మండిప‌డుతున్నారు.

ఊహించ‌ని రీతిలో సీరియ‌స్ గా మారిన ఈ ఇష్యూపై తాజాగా హీరో సందీప్ కిష‌న్ రియాక్ట్ అయ్యారు. తాము ఆడిన ప్ర‌మోష‌న్ నాట‌కాన్ని చెబుతూ.. అంద‌రికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. వాణిజ్య ప్ర‌యోజ‌నాల కోసం ఇంత మందిని ఇంత దారుణంగా త‌ప్పు దారి ప‌ట్టిస్తారా అంటూ ప‌లువురు మండిప‌డుతున్నారు.