Begin typing your search above and press return to search.

మళ్లీ సెట్స్ పైకి 'ప్రాజెక్ట్ K' టీమ్!

By:  Tupaki Desk   |   6 Feb 2022 4:30 PM GMT
మళ్లీ సెట్స్ పైకి ప్రాజెక్ట్ K టీమ్!
X
ప్రభాస్ అనేది ఒక పేరులా కాకుండా మాస్ ఆడియన్స్ జపించే మంత్రంలా మారిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఆయన చుట్టూ చేరిపోయింది. ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే, అందరి దృష్టి ఆ వైపే ఉంటుంది. 'బాహుబలి'కి ముందువరకూ చాలా నిదానంగా సినిమాలు చేస్తూ వచ్చిన ప్రభాస్, ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా సినిమాలను పట్టాలెక్కించడం మొదలుపెట్టాడు. అలా ఆయన ఒప్పుకున్న 'సలార్' కానీ .. 'ఆది పురుష్' కానీ భారీ బడ్జెట్ చిత్రాలే. ఈ సినిమాలు ఎప్పటికి పూర్తికావాలి? .. మిగతా ప్రాజెక్టులు ఎప్పుడు మొదలుపెట్టాలి? అని చాలామంది అనుకున్నారు.

కానీ ప్రభాస్ చాలా వేగంగా 'ఆది పురుష్' సినిమాను అవ్వగొట్టేసి, 'సలార్'ను ముగింపు దశకి తీసుకుని వచ్చేశాడు. అంతేకాదు ఆ తరువాత సినిమా అయిన 'ప్రాజెక్టు K' కూడా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యేలా చూసుకున్నాడు. ఈ సినిమాల జోనర్లన్నీ కూడా ఒకదానికి ఒకటి ఎంతమాత్రం సంబంధం లేనివే. 'ఆది పురుష్' పౌరాణికమైతే .. 'సలార్' మాస్ యాక్షన్ మూవీ అయితే, 'ప్రాజెక్టు K' సూపర్ హీరో కాన్సెప్ట్ తో నిర్మితమవుతోంది. సాధారణంగా ప్రభాస్ ను చూడగానే సూపర్ హీరోలానే కనిపిస్తాడు. అందువలన ఆ జోనర్ సినిమాకి ఆయన కరెక్టుగా సరిపోతాడు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇది పాన్ ఇండియా సినిమా కాదనీ .. పాన్ వరల్డ్ సినిమా అని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పడం విశేషం. ఈ సినిమాకి సంబంధించిన మరో షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. వారం రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ఎవరెవరిపై సీన్స్ ను షూట్ చేయనున్నారనేది తెలియాల్సి ఉంది. వచ్చేనెల నుంచి ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతుందని అంటున్నారు. ప్రభాస్ సరసన నాయికగా దీపిక పదుకొనే కనిపించనుంది. ఈ ఇద్దరి జోడీని తెరపై చూడటానికి అభిమానులు తహతహలాడుతున్నారు. ఈ సినిమాలో అమితాబ్ సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.

కథాకథనాల పరంగా .. గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమాను ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకుపోతుందని నాగ్ అశ్విన్ చెబుతున్నాడు. ప్రభాస్ ను ఎలా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారో అలా చూస్తారని అంటున్నాడు. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమా రూపొందుతుందనీ, ఈ సినిమా ప్రభాస్ కెరియర్లోనే ప్రత్యేకమైనదని చెబుతున్నాడు. అలాగే వైజయంతీ బ్యానర్ స్థాయిని పెంచేది అవుతుందని అంటున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమాను ప్రభాస్ లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.