Begin typing your search above and press return to search.

ఆకాశ్ పూరీ జోడిగా బెంగుళూరు భామ

By:  Tupaki Desk   |   24 Sep 2017 4:54 AM GMT
ఆకాశ్ పూరీ జోడిగా బెంగుళూరు భామ
X
స్టార్ డైరెక్టర్ గా సినిమాలు మీదు సినిమాలు కమిట్ అవుతూ క్షణం తీరక లేకుండా కాలం గడుపుతున్న పూరీ జగన్నాథ్ ఇప్పుడు తన కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగాడు. ఇటీవలే బాలకృష్ణ ను తేడా సింగ్ గా చూపించడానికి ట్రై చేసిన పూరీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. బాలయ్య ఫ్యాన్స్ ని పైసా వసూల్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం వల్ల ఈ సినిమాకు పెద్ద వసూళ్లు రాలేదు. దీంతో దాదాపు 12 కోట్లు లాస్ తో పైసా వసూల్ ఈ ఏడాది ఫ్లాప్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. కానీ బాలయ్య దృష్టిలో పడ్డ పూరీకి మళ్లీ ఆయన అవకాశం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే విషయాన్ని పైసా వసూల్ ప్రమోషన్స్ బాలయ్యే స్వయంగా ఎనౌన్స్ చేశాడు.

అయితే బాలయ్య విషయాన్ని కాసేపు పక్కనపెడితే ప్రస్తుతం పూరీ తన తనయుడు ఆకాశ్ పూరీని రీలాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చిన ఆకాశ్ కు ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆకాశ్ రెండో చిత్రాన్ని స్వయంగా పూరీనే డైరెక్ట్ చేస్తున్నాడు. ఛార్మీ ఈ సినిమాని నిర్మిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా బెంగుళూరు భామ నేహశెట్టిని ఎంపిక చేసినట్లుగా తెలిసింది. ఇటీవలే అకాశ్ - నేహా శెట్టి పై ఫొటో షూట్ చేసినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతుందని టాక్. మరి చాలా మంది హీరోలకి లైఫ్ ఇచ్చిన పూరీ ఇప్పుడు తన తనయుడిని హీరోగా నిలబెడతాడో లేదో వేచి చూద్దాం!