Begin typing your search above and press return to search.

చిరూ చెంపపై నిజంగానే కొట్టడంతో ఎర్రగా వాచిపోయింది: రాధిక

By:  Tupaki Desk   |   14 April 2022 1:30 AM GMT
చిరూ చెంపపై నిజంగానే కొట్టడంతో ఎర్రగా వాచిపోయింది: రాధిక
X
1980లలో తెలుగు తెరపై సందడి చేసిన కథానాయికలలో రాధిక ఒకరు. 'న్యాయం కావాలి' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, కెరియర్ పరంగా రాధిక ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తరువాత ఆమె చిరంజీవితో కలిసి చేసిన 'యమకింకరుడు' .. ' అభిలాష' చిత్రాలు కథానాయికగా ఆమె స్థానాన్ని పదిలం చేశాయి. అప్పట్లో ఇటు నటన పరంగాను .. అటు గ్లామర్ పరంగాను ముందువరుసలో ఉన్న జయసుధ .. జయప్రద .. శ్రీదేవికి ఆమె గట్టి పోటీ ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు.

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రాధిక పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి రన్ అవుతోంది. అలీ అడిగిన ప్రశ్నలకు రాధిక స్పందిస్తూ .. 'న్యాయం కావాలి' సినిమాతో తెలుగులో నా ప్రయాణం మొదలైంది. ఆ సినిమాలో చిరంజీవిగారిని చెంప మీద కొడుతూ మాట్లాడాలి. ఆ షాట్ పెర్ఫెక్ట్ గా రావడానికి 23 టేకులు తీసుకున్నాను. షాట్ ఓకే అనేసిన తరువాత చూస్తే, చిరంజీవిగారి చెంప ఎర్రగా వాచిపోయింది. ఆ సంఘటన ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోయింది.

సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత 'అమ్మ' పాత్రలకు పిలుస్తుంటారు. ఇండస్ట్రీలో ఆ ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది కదా. దానిని బ్రేక్ చేయడం కోసమే 'రాడాన్' పేరుతో సొంత సంస్థను స్థాపించాను. ముందుగా టెలివిజన్లో ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది ఈటీవీ వారే. నేను .. శరత్ కుమార్ .. అరవింద స్వామిగారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారం. ఒకానొక సమయంలో శరత్ కుమార్ ను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పేశాను. హఠాత్తుగా మేము తీసుకున్న నిర్ణయం చూసి అరవింద్ స్వామినే షాక్ అయ్యాడు" అంటూ చెప్పుకొచ్చారు.

ఇలా రాధిక ఈ కార్యక్రమం ద్వారా అనేక విషయాలను పంచుకున్నారు. అలీ అడిగిన ప్రశ్నలు .. రాధిక సమాధానాలు వింటుంటే, త్వరలో ప్రసారం కానున్న ఫుల్ ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుందనే విషయం అర్థమవుతోంది. ఇక కొంత గ్యాప్ తరువాత రాధిక 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో కీలకమైన పాత్రను పోషించారు. మరో రెండు మూడు సినిమాలలో ఆమె ముఖ్యమైన పాత్రలను చేస్తున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన సమాచారం రానుంది.