Begin typing your search above and press return to search.

మీలాంటి పిచ్చి ఫ్యాన్స్ వద్దంటున్న హీరో

By:  Tupaki Desk   |   22 April 2019 6:35 AM GMT
మీలాంటి పిచ్చి ఫ్యాన్స్ వద్దంటున్న హీరో
X
సౌత్ లో హీరోల మీద అభిమానం హద్దులు దాటి ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. అందులోనూ తమిళ తంబీలు కాస్త శృతి మించుతారన్న వాస్తవాన్ని పదే పదే రుజువు చేసేందుకు అక్కడి హీరోల ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. వీళ్ళెంత అతి చేస్తే తమకు అంత పబ్లిసిటీ అనుకునే హీరోలు లేకపోలేదు. కానీ లారెన్స్ మాత్రం దీనికి భిన్నమని చాటుతున్నాడు.

విషయానికి వస్తే మొన్న శుక్రవారం తమిళనాడులో భారీ ఎత్తున విడుదలైన కాంచన 3ని పురస్కరించుకుని ఓ వీరాభిమాని ఏకంగా క్రేన్ మాట్లాడుకుని వచ్చి లారెన్స్ నిలువెత్తు కటవుట్ పైదాకా వెళ్లి దాని తలలో పూల మాల వేసి పాలాభిషేఖం చేశాడు. ఇది కాస్త వీడియో రూపంలో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్రేన్ లో ఏదైనా లోపం తలెత్తినా ఒక నిండు ప్రాణం పోయే పరిస్థితి. ఇది కాస్త లారెన్స్ దాకా వెళ్ళింది

దీంతో ఆగ్రహించిన లారెన్స్ సోషల్ మీడియా వేదికగా తన ఫాన్స్ కు స్ట్రాంగ్ మెసేజ్ లాంటి వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి చర్యలను తాను సమర్ధించే ప్రసక్తే లేదని ఇంట్లో మనకోసం కుటుంబం ఎదురు చూస్తుంటుందన్న ధ్యాస లేకుండా ఇలాంటి విపరీత పనులకు దిగితే తాను సహించనని తేల్చి చెప్పాడు. అంతే కాదు నా అభిమానులు అని రుజువు చేసుకోవాలి అనిపిస్తే డబ్బు లేని పేద పిల్లల ఫీజులు కట్టడమో లేదా అనాధలకు అన్నం పెట్టడమో లాంటివి చేయమని వాటిని గర్వంగా తాను షేర్ చేస్తానని హితవు పలికాడు.

మొత్తానికి ఓ అభిమాని చేసిన అతి ఇక్కడికి దారి తీసిందన్న మాట. ఇక్కడ తక్కువ కాని లారెన్స్ కు తమిళనాట ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. చెన్నై నగరంలో విశ్వాసం-పేటల తర్వాత ఈ ఏడాది అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా కాంచన 3 రికార్డు సృష్టించడం విశేషం