Begin typing your search above and press return to search.

ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న గుణశేఖర్ న్యూ ప్రాజెక్ట్...!

By:  Tupaki Desk   |   24 Jun 2020 1:30 AM GMT
ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న గుణశేఖర్ న్యూ ప్రాజెక్ట్...!
X
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమర్షియల్‌, పౌరాణిక, చారిత్రక నేపథ్యం గల చిత్రాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'రామాయణం' 'మనోహరం' 'చూడాలని ఉంది' 'ఒక్కడు' సినిమాలతో ఇండస్ట్రీలో అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసాడు. అయితే ఆ సినిమాల తర్వాత గుణశేఖర్ కి ఆ రేంజ్ లో సక్సెస్ దక్కలేదనే చెప్పాలి. భారీ సెట్స్ భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలిచే గుణశేఖర్ 'రుద్రమదేవి' సినిమా తర్వాత మరో సినిమా పట్టాలెక్కించలేదు.

అయితే దగ్గుబాటి రానాతో ‘హిరణ్యకశ్యప’ టైటిల్‌ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు గుణశేఖర్. ఈ సినిమాని సురేశ్‌‌ ప్రొడక్షన్స్‌ సురేష్ బాబు మరియు గుణ టీమ్ వర్క్స్ గుణశేఖర్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నారని వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టే గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం అటకెక్కిందని.. సురేష్ బాబు భారీ బడ్జెట్ సినిమాలు తీసే ఆలోచన విరమించుకున్నాడని జోరుగా ప్రచారం జరిగింది.

తాజాగా దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. 'హిర్యణ్యకశ్యప' ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పాన్‌ ఇండియా లెవల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని కూడా తెలిపింది. దీంతో ఈ సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్న పుకార్లకు చిత్ర యూనిట్ పుల్‌ స్టాప్‌ పెట్టింది. కాగా ఇది భక్త ప్రహ్లాద కథే అయినప్పటికీ ఈ సినిమాను హిరణ్యకశ్యపుడి కోణంలో గుణశేఖర్‌ తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. 'బాహుబలి' వంటి జానపద చిత్రం.. 'రుద్రమదేవి' వంటి చారిత్రక నేపథ్య సినిమాల్లో నటించిన దగ్గుబాటి రానా ఇప్పుడు 'హిరణ్యకశ్యప' వంటి పౌరాణిక చిత్రంలో కూడా నటించబోతున్నాడు. రానా ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన వెంటనే 'హిరణ్యకశ్యప' సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.