Begin typing your search above and press return to search.

ప్రఖ్యాత నటుడు రంగనాథ్ ఆత్మహత్య

By:  Tupaki Desk   |   20 Dec 2015 4:04 AM GMT
ప్రఖ్యాత నటుడు రంగనాథ్ ఆత్మహత్య
X
పాతతరం కథానాయకుడు.. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రంగనాథ్ శనివారం తన నివాసంలో ఉరి వేసుకున్నారు. సినీప్రియులకు సుపరిచితుడైన ఆయన ఫ్యాన్ కి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవటం సంచలనం సృష్టిస్తోంది. నిజానికి ఆయన శనివారం ఒక సన్మాన కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. దానికి సంబంధించిన వారు ఇంటి రావటంతో ఈ విషయం బయటపడింది. దాదాపుగా 300 చిత్రాలకు పైగా నటించిన 66 ఏళ్ల రంగనాథ్ 30కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని గాంధీ నగర్ లోని నర్మద ఆసుపత్రికి దగ్గర్లో నివాసం ఉంటున్నారు.

1949లో చెన్నైలో పుట్టిన ఆయన అసలు పేరు ‘‘తిరుమల సుందర శ్రీ రంగనాథ్’’. వెంకబేశ్వర వర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన తొలినాళ్లలో టిక్కెట్ కలెక్టర్ గా పని చేవారు. అనంతరం ఆయన సినిమా రంగంలోకి వచ్చారు. ఆయన భార్య ఈ మధ్యకాలంలో చనిపోగా ఆయనకు ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమర్తె రంగనాథ్ ఇంటికి సమీపంలో ఉంటుంటే.. చిన్న కుమార్తె.. కుమారుడు మాత్రం బెంగళూరులో ఉంటున్నారు.

ఆయన ఆత్మహత్య చేసుకోవటానికి ముందు.. తన స్నేహితుడు.. ‘‘నేటి నిజం’’ ఎడిటర్ బైసా దేవదాసుకు ‘‘గుడ్ బై సార్’’ అంటూ మొబైల్ నుంచి మేసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తాను ఉరి వేసుకున్న రూమ్ గోడలపైన పెన్నుతో.. ‘‘నా బీరువాలో పనిమనిషి మీనాక్షి పేరు మీద ఉన్న ఆంధ్రాబ్యాంకు బాండ్స్ ఉన్నాయి. ఆమెకు అప్పగించండి. డోంట్ ట్రబుల్ హర్’’ అంటూ రాయటం కనిపించింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఎంతో ఆలోచించి.. దీనికి పాల్పడినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

సన్మాన కార్యక్రమానికి తీసుకెళ్లేందుకు నిర్వాహకులు ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టినా రాకపోవటంతో.. వారు.. దగ్గర్లో ఉన్న ఆయన కుమార్తె ఇంటికి వెళ్లి.. విషయం చెప్పగా..వారంతా కలిసి వచ్చి ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూస్తే.. రంగనాథ్ ఊరేసుకొని ఉన్న దృశ్యం కనిపించింది. దీంతో షాక్ తిన్న వారు.. ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

సుమారు ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో అద్దెకు దిగినట్లుగా చెబుతున్నారు. రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వచ్చి.. వివరాలు సేకరిస్తున్నారు. రంగనాథ్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయన భార్య చైతన్యను అమితంగా ఆరాధించేవారని చెబుతారు. దేవుడి మందిరంలో ఆమె ఫోటో పెట్టుకున్న ఆయన.. దానిపై డెస్టినీ అని రాసుకున్నారు. 2009లో భార్య మరణించిన తర్వాత ఒంటరితనాన్ని భరించలేకపోయేవారు. భార్య గురించి ఆలోచనల్లోనిత్యం మునిగిపోయేవారని.. దీనికి తోడు ఈ మధ్య కాలంలో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు మొదలు కావటం మరింత ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. దీంతో..ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక.. ఆయన సినిమా నేపథ్యాన్ని చూస్తే.. 1974లో ‘‘చందన’’ చిత్రంలో హీరోగా నటించిన రంగనాథ్.. ‘‘జమీందారుగారి అమ్మాయి’’.. ‘‘దేవతలారా దీవించండి’’.. ‘‘పంతులమ్మ’’.. ‘‘ఇంటింటి రామాయణం’’.. ‘‘అమెరికా అమ్మాయి’’.. ‘‘త్రినేత్రుడు’’.. ‘‘రుద్రనేత్ర’’.. ‘‘కొదమ సింహం’’.. ‘‘కొండవీటి దొంగ’’.. తాయారమ్మ బంగారయ్య’’.. ‘‘అందమే ఆనందం’’ లాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. టీవీలో కూడా నటించినఆయన.. ఈటీవీలో.. ‘‘శాంతి నివాసం’’’ సీరియల్ లో నటించారు. శివాజీరాజా నటించిన మెగుడ్స్ పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వ వహించారు.