Begin typing your search above and press return to search.

రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ఆ పార్టీ నేత‌ల సెగ అందుకేనా?

By:  Tupaki Desk   |   26 July 2022 9:37 AM GMT
రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ఆ పార్టీ నేత‌ల సెగ అందుకేనా?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఆర్ఆర్ఆర్ ఘ‌న‌విజ‌యం త‌ర్వాత ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్త‌యింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ డ్యుయెల్ రోల్ లో న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు రావ‌డంతో ఈ సినిమాపై భారీ హైప్ నెల‌కొంది.

కాగా ఈ సినిమాకు బీజేపీ నేత‌ల సెగ త‌గిలింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ను స్థానిక‌ బీజేపీ నేతలు అడ్డుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. సరూర్ నగర్‌ వీఎం హోంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా.. స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల తరగతులు జరుగుతున్న వేళ షూటింగులకు అనుమతి ఏ విధంగా ఇస్తారని శ్రీవాణి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

విద్యాశాఖ మంత్రి, స్థానిక నియోజ‌క‌వ‌ర్గం మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తమ స్వలాభం కోసమే విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి సినిమా షూటింగ్‌కు అనుమతి ఇచ్చారని కార్పొరేటర్ శ్రీవాణి విమ‌ర్శ‌లు గుప్పించారు.

విద్యార్థుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించి.. నాణ్య‌మైన విద్య‌ను అందించాల్సి ఉండ‌గా సినిమా షూటింగుల‌కు అనుమ‌తి ఇచ్చి ప్రభుత్వం ఖ‌జానాకు నిధులు పోగేసుకుంటోంద‌ని బీజేపీ కార్పొరేట‌ర్ శ్రీవాణి మండిప‌డుతున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విద్య వద్దు.. సినిమా షూటింగ్లు ముద్దు అంటూ నినాదాలు చేశారు.

వెంటనే రామ్‌చరణ్ సినిమా షూటింగు ఆపేయాలని ఆమె బిజెపి శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. సినిమా షూటింగుల కారణంగా పిల్లలకు చదువుకోవడం ఇబ్బందికరంగా మారుతుందని ఆమె ఆరోపిస్తున్నారు. సినిమా షూటింగ్ కోసం రూ. 4 కోట్లు రూపాయలు మంజూరు చేసి వీఎం హోమ్ మరమత్తు పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో సినిమాకు షూటింగ్‌లో షాట్స్ బాగా రావడం లేదని సబితా హుటాహుటిన నిధులు మంజూరు చేశారని ఆరోపించారు.

మ‌రోవైపు బీజేపీ నేత‌లు సినిమాల‌పై దాడులు చేయ‌డం ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువైంద‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేసి, వివాదాల్లో వేలుపెట్ట‌డం బీజేపీ నేత‌ల‌కు స‌ర‌దా అని వ్యాఖ్యానిస్తున్నారు.