Begin typing your search above and press return to search.

'ఆచార్య'కు కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టిన RRR

By:  Tupaki Desk   |   30 March 2022 10:33 AM GMT
ఆచార్యకు కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టిన RRR
X
రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే ఈ మల్టీస్టారర్ తో జక్కన్న ఇమేజ్ మ‌రింత బ‌ల‌పడింది. అంతేకాదు ఇద్దరు ట్రిపుల్ ఆర్ హీరోల నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా సక్సెస్ తో ఇప్పుడు చరణ్ - తారక్ లపై అందరి దృష్టి పడింది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు వీరిద్దరి గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ క్రేజ్ ను పూర్తిగా ఉపయోగించుకోడానికి రామ్ చరణ్ రెడీ అయ్యారు. తన తదుపరి చిత్రాన్ని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

RRR సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే చరణ్ మరోవైపు ''ఆచార్య'' చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో చెర్రీ కీలకమైన రోల్ లో కనిపించనున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని టాక్.

అప్పుడెప్పుడో పూర్తైన 'ఆచార్య' చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు - హిందీతో పాటుగా పలు ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పుడు RRR సినిమా హిట్ అవ్వడంతో.. ఇదే క్రమంలో 'ఆచార్య' ప్రచారానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

చరణ్ హోమ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మించారు. చెర్రీ ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడానికి తన భుజస్కందాలపై వేసుకుని ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నాడట.

'RRR' సినిమా కోసం నేషనల్ వైడ్ ప్రచారంలో పాల్గొన్న రామ్ చరణ్.. ఇప్పుడు 'ఆచార్య' కోసం మళ్లీ అలాంటి ప్రచారమే చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ట్రిపుల్ ఆర్ మూవీ విజయంతో జంజీర్ హీరోకి నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇదే ఆచార్యకు స్పెషల్ ఎట్రాక్షన్ తీసుకొస్తుందని భావిస్తున్నారు.

'సైరా' సినిమాతో ప్రభావం చూపలేకపోయిన చిరంజీవి.. ఈసారి బాలీవుడ్ లో సత్తా చాటాలని ఆశ పడుతున్నారు. దీనికి ఇప్పుడు తనయుడు కూడా తోడయ్యాడు. అందుకే విడుదలకు పది రోజుల ముందు అగ్రిసివ్ గా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ షెడ్యూల్స్‌ ని రూపొందిస్తోందట. బాలీవుడ్ మీడియాకి మెగా తండ్రీకొడుకులు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారట.

'ఆచార్య' చిత్రాన్ని సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు కొరటాల తీర్చిదిద్దుతున్నారు. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్.. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.

మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది.