Begin typing your search above and press return to search.

రామగుండం చేరుకున్న సలార్ బృందం.. 'ప్రభాస్'కు ఫ్యాన్స్ ఘనస్వాగతం!!

By:  Tupaki Desk   |   29 Jan 2021 3:30 PM GMT
రామగుండం చేరుకున్న సలార్ బృందం.. ప్రభాస్కు ఫ్యాన్స్ ఘనస్వాగతం!!
X
యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను చేస్తూ వెళుతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఫేమ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్. తాజాగా కేజీఎఫ్ డైరెక్టర్ తో కలిసి సలార్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అభిమాన హీరో సినిమాల ఆడియో ఫంక్షన్లకే రచ్చచేసే అభిమానులు అదే హీరో షూటింగ్ కోసం మన ఏరియాలో అడుగుపెడితే ఆ సందడి ఎలా ఉంటుందో ఊహించుకోలేము.

ప్రస్తుతం కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాలలో ప్రభాస్ అభిమానుల జోరు అలాగే ఉంది. ఇప్పటికే సలార్ నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్కుకు ఎలాంటి స్పందన లభించిందో తెలిసిందే. ఆ కటౌట్స్ తో ప్రభాస్ వచ్చే రూట్ అంతా భారీ హోర్డింగ్స్, ఫ్లెక్సీలతో నింపేశారు ఫాన్స్.

కేజీఎఫ్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో సినిమా అనేసరికి సినిమా పై కేజీఎఫ్ కంటే ఎక్కువ అంచనాలు నెలకొన్నాయి. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవల హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే సలార్ ఫస్ట్ షెడ్యూల్ రెగ్యులర్ షూటింగ్ జనవరి 29 నుండి ఫిబ్రవరి 12 వరకు జరగనుంది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించారు. ప్రభాస్‌తో సహా ఇతర ప్రధాన తారాగణమంతా అక్కడికి చేరుకున్నారు.

పోలీస్ కాన్వాయ్ లో ప్రభాస్ ను రామగుండం బొగ్గు గనులలోకి తీసుకెళ్లారు. ప్రభాస్ వచ్చాడని తెలిసి అక్కడికి భారీఎత్తున అభిమానులు చేరుకున్నారట. ఈ సినిమాతో కన్నడ, తెలుగు, తమిళ భాషలకు చెందిన కొత్త నటీనటులు ఎంతోమంది పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.