Begin typing your search above and press return to search.

సల్మాన్‌ ఆస్తంతా కరిగించేద్దామనే..

By:  Tupaki Desk   |   24 Jun 2015 6:09 AM GMT
సల్మాన్‌ ఆస్తంతా కరిగించేద్దామనే..
X
గొడవ జరిగిందేమో ఐదారు కోట్లకు సంబంధించి. కానీ ఆ నిర్మాత ఏకంగా హీరో గారి దగ్గర్నుంచి ఏకంగా రూ.250 కోట్లు రాబట్టేద్దామని చూస్తున్నాడు. తన పరువుకు నష్టం కలిగించాడని.. తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేశాడని.. సల్మాన్‌ ఖాన్‌పై రూ.250 కోట్లకు దావా వేసేశాడు నిర్మాత విజయ్‌ గలాని. ఇంతకీ సల్మాన్‌ అంతగా ఆయన పరువుకు ఏం భంగం కలిగించాడు? ఆయనకు అంత వేదన ఎందుకు కలిగించాడు? తెలుసుకుందాం పదండి.

సల్మాన్‌ ఫామ్‌లో లేని సమయంలో చేసిన వ్యర్థ ప్రయత్నాల్లో 'వీర్‌' ఒకటి. ఓ చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకత్వం కూడా చేశాడు సల్మాన్‌. ఐతే హిస్టారికల్‌ మూవీ కావడంతో భారీ బడ్జెట్‌ పెట్టించాడు. దాదాపు రూ.70 కోట్ల దాకా ఖర్చయింది. సల్మాన్‌ మీద నమ్మకంతో ముందూ వెనుకా చూసుకోలేదు నిర్మాత విజయ్‌ గలాని. కానీ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. దారుణమైన నష్టాలు మిగిల్చింది.

ఐతే నిర్మాత కష్టాన్ని చూసి బాధపడకుండా తనకు రావాల్సిన రెమ్యూనరేషన్‌ విషయంలో పేచీ పెట్టుకున్నాడు సల్మాన్‌. మంచి లాభాలు వస్తే రూ.15 కోట్లు ఇస్తానని అగ్రిమెంట్‌ రాసుకున్న నిర్మాత.. భారీ నష్టాలు మిగలడంతో చేతులెత్తేశాడు. కానీ తనకిస్తానన్న 15 కోట్లు ఇవ్వాల్సిందేనని సల్మాన్‌ పట్టుబట్టి తీవ్రంగా వేధించాడన్నది గలాని ఆరోపణ. దీనికి సంబంధించి కేసు కూడా తానే గెలిచానని.. కానీ తనపై ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్టర్న్‌ ఇండియా సినీ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసి సల్మాన్‌ తన పరువు తీశాడని.. అంతే కాక మూడేళ్లపాటు తీవ్ర మానసిక వేధింపులకు గురి చేశాడని.. ఇందుకు గాను అతడు తనకు పరువు నష్టం కింద రూ.250 కోట్లు చెల్లించాలని దావా వేశాడు గలాని. ఐతే దావా వేస్తే వేశాడు కానీ.. ఏకంగా రూ.250 కోట్లకు వేసేయడం విడ్డూరం.