Begin typing your search above and press return to search.

ట్విట్టర్లో పిట్టలు రెట్టలేస్తాయంతే .. అవి చూడొద్దు!

By:  Tupaki Desk   |   25 July 2022 3:33 AM GMT
ట్విట్టర్లో పిట్టలు రెట్టలేస్తాయంతే .. అవి చూడొద్దు!
X
టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో చాలామంది కొత్త దర్శకులు పరిచయమవుతున్నారు. కొత్త దర్శకులను పరిచయం చేయడంలో రవితేజ ఎప్పుడూ ముందుంటూ వస్తున్నాడు. కథ చెప్పే తీరుతోనే ఆయన ఆ దర్శకుడిలో విషయం ఉందనే విషయాన్ని గ్రహించేస్తాడు.

ఆయన తాజా చిత్రమైన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను రూపొందించిన శరత్ మండవకి కూడా ఇదే ఫస్టు సినిమా. ఈ నెల 29వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది.

ఈ వేదికపై శరత్ మండవ మాట్లాడుతూ .. " ఈ సినిమా ట్రైలర్ ను మీరంతా చూసే ఉంటారు. ట్రైలర్లో మీరు చూసిన దానికి రెట్టింపు ఈ సినిమా ఇస్తుంది.

ముందుగా రవితేజ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను నమ్మి నాకు ఆయన ఈ ప్రాజెక్టును ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. టిక్కెట్ల రేటు విషయానికి వస్తే తెలంగాణలో మల్టీ ప్లెక్స్ లో 195 రూపాయలు .. సింగిల్ స్క్రీన్స్ లో 150 .. 100 .. 50 రూపాయలు ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లు గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయి. 177 .. 147 .. 80 రూపాయలను వాళ్లు ఫిక్స్ చేశారు. సాధ్యమైనంత వరకూ కౌంటర్లకు వెళ్లి టిక్కెట్లను తీసుకోండి. ఈ సినిమా ఇంతబాగా రావానికి కారణం నా టీమ్. సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. చెవుల తుప్పు వదిలిపోవడం ఖాయం .. ఇప్పుడే చూసి వస్తున్నాను. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను థియేటర్లలోనే చూడండి.

ట్విట్టర్లో ట్వీట్ లు చూడకండి .. సినిమా చూడండి. ట్విట్టర్లో పిట్టలు రెట్టలు మాత్రమే వేస్తాయి. అనవసరమైన ట్వీట్లు చూడకుండా .. థియేటర్స్ కి వెళ్లి సినిమాను చూడండి. ట్విట్టర్ లు చూసి సినిమాలకి వెళ్లడం మానేస్తే మనందరం బాగుపడతాము .. థియేటర్లు బాగుపడతాయి" అంటూ చెప్పుకొచ్చాడు.