Begin typing your search above and press return to search.

మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఎఫెక్ట్‌..పోలీస్‌ ఆఫీసర్స్ సస్పెండ్‌

By:  Tupaki Desk   |   20 Jun 2019 10:10 AM GMT
మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఎఫెక్ట్‌..పోలీస్‌ ఆఫీసర్స్ సస్పెండ్‌
X
ఇటీవల కోల్‌ కతాలోని హోటల్‌ మారయిట్‌ నుండి క్యాబ్‌ లో మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌ శెన్‌ గుప్తాను కొందరు ఆకతాయిలు వెంబడించి వేదించిన విషయం తెల్సిందే. కారు అద్దాలు పగులగొట్టి.. డ్రైవర్‌ పై ఆ ఆకతాయిలు చేయి కూడా చేసుకున్నారు. ఆ విషయాన్ని శెన్‌ గుప్తా వీడియో తీసి మరీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దాంతో పాటు వీడియో చూపించి ఫిర్యాదు నమోదు చేయాలని రెండు పోలీస్‌ స్టేషన్‌ లను ఆశ్రయించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.

ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన గురించి సోషల్‌ మీడియాలో సుధీర్ఘ పోస్ట్‌ పెట్టడంతో పాటు వీడియో మరియు కొన్ని ఫొటోలను కూడా షేర్‌ చేసిన శెన్‌ గుప్తాకు సోషల్‌ మీడియా ద్వారా అనూహ్య మద్దతు దక్కింది. దాడి జరుగుతుందని పోలీసుల వద్దకు వెళ్తే కనీసం పట్టించుకోక పోగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు వ్యవస్థ పరిస్థితి ఇది అంటూ సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంకు కోల్‌ కతా పోలీసులు స్పందించారు.

పోలీసులు రంగంలోకి దిగి వీడియో ద్వారా అల్లరి మూకను గుర్తించి అరెస్ట్‌ చేయడం జరిగింది. దాంతో పాటు మైదాన్‌ ప్రాంతంకు చెందిన ఏఎస్సై పార్ధ చటర్జీ మరియు భవనీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ కు చెందిన ఎస్సైలను సస్పెండ్‌ చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు ప్రకటించారు. మరికొందరు పోలీసులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తానికి మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌ కారణంగా పలువురు పోలీసు అధికారులు సస్పెన్షన్‌ కు గురయ్యారు. వారి సస్పెన్షన్‌ తో నెటిజన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.