Begin typing your search above and press return to search.

హీరోతో కియ‌రా పెళ్లి! డిజైన‌ర్ ఇంట్లో దొరికారుగా!

By:  Tupaki Desk   |   25 Dec 2022 4:11 AM GMT
హీరోతో కియ‌రా పెళ్లి! డిజైన‌ర్ ఇంట్లో దొరికారుగా!
X
కియారా అద్వానీ- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ప్రేమాయ‌ణంపై చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. వారిద్దరూ తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించలేదు. క‌నీసం మీడియా ఎదుట దీనిని ధృవీకరించలేదు. ఈ జంట‌ తరచుగా అనేక సందర్భాలలో విదేశీ యాత్ర‌ల్లో కలిసి కనిపించారు. ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే వెళ‌తారు.. క‌లిసి వ‌స్తారు.

కొన్నిసార్లు విడివిడిగా విదేశాల‌కు వెళ్లి తిరిగి క‌లిసి వ‌స్తారు! అందుకు ఎన్నో ఆధారాలున్నాయి. 2022 సంవ‌త్స‌రానికి ఆహ్వానం ప‌లుకుతూ గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో ఈ జంట విదేశీ విహారానికి వెళ్లింది. కానీ విమానాశ్ర‌యంలో విడివిడిగా వెళుతూ క‌నిపించారు. కానీ తిరిగి వ‌చ్చేప్పుడు క‌లిసి వ‌స్తూ విమానాశ్ర‌యంలో ప‌ట్టుబ‌డ్డారు. ఆపై బాలీవుడ్ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వేడెక్కించాయి.

ప్రేమ ప‌క్షుల కుహూగానాలు ఇక ఆగ‌డం లేదు! అంటూ ప‌లు క‌థ‌నాలు వేడెక్కించాయి. అందుకు త‌గ్గ‌ట్టే ఈ జంట‌ ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు పొగిడేయ‌డాలు... హైప్ చేస్తూ మాట్లాడుకోవ‌డాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. సోషల్ మీడియాలో ఒకరికి ఒక‌రుగా త‌మ సినిమాల‌కు మద్దతునివ్వడం బ‌య‌ట‌ప‌డింది. సిద్ధార్థ్ - కియారా జంట‌ 2021 చిత్రం షేర్షాలో స్క్రీన్ స్పేస్ ను పంచుకున్నారు. ఈ జంట కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. స‌రిజోడు అంటూ ప్రేక్షకులు అభిమానులు కూడా కితాబిచ్చేశారు.ఇటీవ‌ల ఈ జంట పెళ్లికి రెడీ అవుతోందంటూ క‌థ‌నాలొస్తున్నాయి. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే శుభ‌లేఖ అచ్చేయించేస్తార‌ని ఇంత‌కుముందు క‌ర‌ణ్ జోహార్ లాంటి ప్ర‌ముఖుడు కాఫీ విత్ క‌ర‌ణ్ లో హింట్ కూడా ఇచ్చారు.

తాజాగా ఓ అంద‌మైన‌ సాయంత్రం సిద్ధార్థ్ -కియారా పాపుల‌ర్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నివాసం నుండి బ‌య‌టికి వెళుతూ కెమెరా కంటికి చిక్కారు. ఆ స‌మ‌యంలో ఈ అంద‌మైన జంట‌పై కెమెరా ఫ్లాష్ లు మెరిసాయి. నిన్న‌టి సాయంత్రం ఈ జంట‌ మనీష్ ఇంటికి ఎందుకు వెళ్లిన‌ట్టు? అంటూ మీడియా ఆరాలు మొద‌ల‌య్యాయి. పెళ్లిలో ధ‌రించే దుస్తుల డిజైన్స్ కోసం వెళ్లారా? అంటూ ఒక సెక్ష‌న్ ఆరాలు తీస్తోంది.

నిజానికి సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ పెళ్లి పీటలు ఎక్కనున్నార‌న్న‌ది ఇటీవ‌ల పెద్ద వార్త‌. ఈ అంద‌మైన జంట‌ వివాహం గురించి పుకార్లు సోషల్ మీడియాలో చాలా సంచలనం సృష్టించాయి. ఎప్పుడు? ఎక్కడ? అనే విష‌యం మాత్రం వెల్ల‌డి కాలేదు. దీనిపై ఇంకా అనిశ్చితి కొన‌సాగుతోంది.

ఈ ఇద్దరూ చండీగఢ్ లోని వివాహ వేదికలను పరిశీలిస్తున్నట్లు కొన్ని బ‌ల‌మైన క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి.. కియారా- సిద్ సంద‌ర్శించిన విలాసవంతమైన క‌ళ్యాణ మంట‌పం ఒకటి చండీగఢ్ లోని ది ఒబెరాయ్ సుఖ్విలాస్ స్పా & రిసార్ట్స్ అంటూ గుస‌గుస వినిపించింది. రాజ్ కుమార్ రావు - పత్రలేఖ జంట‌ వివాహం ఇదే చోట జ‌రిగింది. ఇక్క‌డే ఈ జంట ఒక‌ట‌వుతార‌ని బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

ఇటీవ‌ల మిషన్ మజ్ను ని ప్రమోట్ చేస్తున్న సిద్ధార్థ్ ను రేడియో ఫీవర్ FM నుండి RJ సుప్రియ తాజా పుకార్ల‌ గురించి అడిగారు. దీనిపై సిద్ధార్థ్ స్పందిస్తూ.. ``ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నా`` అని మాత్ర‌మే స‌మాధాన‌మిచ్చాడు. అయితే అతని సమాధానం కియ‌రాను పెళ్లాడేస్తున్నా అని అంగీక‌రించ‌డ‌మేనని అభిమానులు భావిస్తున్నారు. కానీ దానికి అధికారిక ధృవీక‌ర‌ణ లేదు. సిద్ధార్థ్ తన పెళ్లిని వచ్చే ఏడాది అంటే 2023లో ఖ‌రారైన‌ట్టు ధృవీకరించాడని అభిమానులు ఫిక్స‌య్యారు.