Begin typing your search above and press return to search.

పాపం శిరీష్ ని టార్గెట్ చేస్తున్నారు..!

By:  Tupaki Desk   |   3 Nov 2022 12:30 AM GMT
పాపం శిరీష్ ని టార్గెట్ చేస్తున్నారు..!
X
యువ హీరో అల్లు శిరీష్ దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఇప్పుడు ''ఊర్వశివో రాక్షశివో'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హోమ్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. అయితే ఇందులో భాగంగా శిరీష్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ ని ఎడిట్ చేసి ఓ వర్గం నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

శిరీష్ గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండేవాడు. మెగా హీరోలను టార్గెట్ చేసే పోస్టులకు సైతం స్పందించడానికి వెనకాడేవాడు కాదు. ఆ సమయంలో ఓ వర్గం నెటిజన్స్ నుంచి అతను చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అల్లువారబ్బాయి యాక్టీవిటీలో కంప్లీట్ గా చేంజ్ వచ్చేసింది. చాలా కూల్ అండ్ కామ్ గా ఉంటున్నాడు.

సోషల్ మీడియా మాధ్యమాలను ఏదైనా అవసరం ఉంటే తప్ప.. తరచుగా ఉపయోగించడం లేదు శిరీష్. దీనికి కారణం వయస్సు రీత్యా మరింత పరిణతి చెందడమే అయ్యుండొచ్చని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యువ హీరో పేర్కొన్నాడు. ట్రోలింగ్ ను పట్టించుకోవడం మానేశానని.. ప్రశాంతంగా ఉండటాన్ని అలవాటు చేసుకున్నానని తెలిపారు. అయితే యాంటీ ఫ్యాన్స్ వర్గం మాత్రం శిరీష్ పై ట్రోలింగ్ చేయడం ఆపడం లేదు.

ఇటీవలి 'ఊర్వశివో రాక్షశివో' ప్రమోషనల్ టూర్ లో భాగంగా కాలేజీలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ ను ఉపయోగిస్తూ.. శిరీష్ పై మరియు అతని కుటుంబంపై అసహ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారు. దీంతో అల్లు ఫ్యాన్స్ కూడా వారిని డిపెండ్ చేయడానికి మిగతా హీరోల ఫ్యామిలీపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో హీరోలను ట్రోల్ చేయడం అనేది ఈరోజుల్లో కామన్ అయిపోయింది. కానీ అతని కుటుంబాన్ని కూడా అందులోకి లాగడం అనేది చాలా అసహ్యకరమైనదిగా భావించాలి. సినిమాల విషయంలో పరిధి దాటకుండా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం కొంత వరకూ కానీ.. మరీ ఇంతలా దిగజారి హీరోల ఫ్యామిలీపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఎవరూ అంగీకరించరు.

ఏ హీరో అభిమానులైన సరే, ఇలా ఫ్యాన్ వార్స్ పేరుతో ఇలా పర్సనల్ గా కామెంట్స్ చేయడాన్ని అన్ని వర్గాలు వారు తప్పకుండా ఖండించాలి. అల్లు శిరీష్ మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ.. ఇలా వ్యక్తిగత దాడికి దిగడం సరైనది కాదు. ఒకరి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అందరు హీరోల అభిమానులు ఆలోచించాలి.

ఇకపోతే అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ''ఊర్వశివో రాక్షశివో'' చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. రాకేష్ శశి ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రూపొందించారు. తమ్మారెడ్డి భరద్వాజ - ధీరజ్ మొగిలినేని మరియు విజయ్ ఎం నిర్మాతలుగా వ్యవహరించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.