Begin typing your search above and press return to search.

రూప వైట్ల ఫిర్యాదు కాస్తా కేసు అయి..రాజీ అయ్యింది

By:  Tupaki Desk   |   28 Oct 2015 7:34 AM GMT
రూప వైట్ల ఫిర్యాదు కాస్తా కేసు అయి..రాజీ అయ్యింది
X
పుష్కరకాలంగా కలిసి బతుకుతున్నప్పటికీ.. తనను పెళ్లి అయిన నాటి నుంచి వేధిస్తున్నారంటూ భర్త.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల మీద సంతోషి రూప ఆరోపణలు చేయ‌టం తెలిసిందే. భర్తతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఒక సంచ‌ల‌నంగా మారింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. శ్రీను వైట్ల స‌తీమ‌ణి రూప పిర్యాదు చేయ‌టం.. దానికి సంబంధించిన ప‌రిణామాలు చాలానే జ‌రిగినా..కొన్ని విష‌యాలు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. భ‌ర్త మీద ఫిర్యాదు చేయ‌టం.. దాన్ని పోలీసులు కేసుగా మార్చేయ‌టం.. తాజాగా రాజీ అయిపోవ‌టం అన్నీ జ‌రిగినా.. ఈ మొత్తం ఏపిసోడ్ లో కొన్ని విష‌యాలు ప్ర‌ముఖంగా బ‌య‌ట‌కు రాగా.. మ‌రికొన్ని పెద్ద‌గా బ‌య‌ట‌కు రాక‌పోవ‌టంతో అస‌లేం జ‌రిగిందో అర్థం కాని ప‌రిస్థితి.

మ‌రింత చిత్ర‌మైన విష‌యం ఏమిటంటే.. త‌న భ‌ర్త మీద కంప్లైంట్ ఇవ్వ‌టానికి వెళ్లిన స‌మ‌యంలో స‌మాచారం బ‌య‌ట‌కు పొక్క‌కున్నా.. రాజీ చేసుకున్నాక మాత్రం విష‌యం బ‌య‌ట‌కు రావ‌టం గ‌మ‌నార్హం.

ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యాన్ని చూస్తే..

అక్టోబ‌రు 15న ద‌ర్శ‌కులు శ్రీను వైట్ల స‌తీమ‌ణి రూప వైట్ల బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. త‌న భ‌ర్త శ్రీను వైట్ల‌.. ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు.. బంధువులు.. స్నేహితులు సైతం తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. పిల్ల‌లు.. ప‌ని మ‌నిషి ఎదుట త‌న‌ను త‌న భ‌ర్త చేయి చేసిన‌ట్లుగా ఆరోపించారు. పెళ్లి జరిగి 12 ఏళ్లు అవుతున్నా.. మొదటి నుంచి తనను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్ పగలకొట్టటం.. తన తల్లిదండ్రుల్ని అసభ్య పదజాలంతో దూషించినట్లుగా కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అక్టోబ‌రు 15న ఫిర్యాదు చేస్తే దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించార‌న్న మాట వినిపిస్తోంది. ఇలాంటి కేసుల్లో స‌హ‌జంగా భార్య‌.. భ‌ర్త‌లు ఇద్ద‌రిని స్టేష‌న్ కు పిలిపించ‌టం.. కౌన్సిలింగ్ ఇవ్వ‌టం లాంటివి చేస్తారు. కానీ.. అందుకు భిన్నంగా బంజారాహిల్స్ స్టేష‌న్ పోలీసులు ఫిర్యాదును కేసుగా న‌మోదు చేశారు. ఎఫ్ఐఆర్ నెంబ‌రు 1144/2015 కింద కేసుతో పాటు.. ఐపీఎస్‌ సెక్ష‌న్ 498, 323 కింద కేసు న‌మోదు చేశారు.

అయితే.. ఇది జ‌రిగిన సుమారు రెండు వారాల త‌ర్వాత (అక్టోబ‌రు 26న‌).. ఇద్ద‌రి మ‌ధ్య‌న రాజీ జ‌ర‌గ‌టం.. తాను ఇచ్చిన ఫిర్యాదును వెన‌క్కి తీసుకోవ‌టానికి శ్రీనువైట్ల స‌తీమ‌ని బంజారాహిల్స్ పోలీసుస్టేష‌న్ ను ఆశ్రయించిన స‌మ‌యంలో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంటే.. ఫిర్యాదు చేసిన స‌మ‌యంలో బ‌య‌ట‌కు రాని స‌మాచారం ఫిర్యాదు (పోలీసుల పుణ్య‌మా అని కేసు అయ్యింద‌నుకోండి)ను వెన‌క్కి తీసుకునే క్ర‌మంలో బ‌య‌ట‌కు రావ‌టంతో మీడియా అంతా గంద‌ర‌గోళం నెల‌కొంది. ఇద్ద‌రి మ‌ధ్య రాజీతో భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రు ప్ర‌స్తుతం బాగానే ఉన్నార‌ని చెబుతున్నారు.